రాత్రి సరిపడా నిద్రపోయినా, పగటిపూటమళ్లీ నిద్ర వస్తోందా …
ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తోందా- బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
హైదరాబాద్ మార్చ్ 14
Do you feel tired the moment you wake up? Do you know what is happening inside your body?
ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా, ఆరోగ్యం ఇనుమడించాలన్నా నిద్ర చాలా కీలకం. రోజంతా తీరిక లేని పనులతో అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర కొత్త శక్తి అందేలా చేస్తుంది. అయితే, కొంతమంది రాత్రిపూట నిద్రపోయినప్పటికీ పగటిపూట అలసటగా ఉంటారు. నిద్ర ముంచుకొస్తున్నట్లుగా అనిపిస్తుందని చెబుతుంటారు. అయితే రాత్రిళ్లు దాదాపు 8 గంటలు నిద్రపోయినా మర్నాడు నీరసంగా ఉండటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
నిద్ర సమస్య :
పగటిపూట మత్తుగా, అలసటగా ఉండటానికి స్లీప్ అప్నియా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు నిద్రిస్తున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై, శ్వాసమార్గానికి అడ్డుపడుతుంది. తద్వారా శ్వాస సరిగా అందక గట్టిగా గురక పెడుతూ ఊపిరి తీసుకుంటారు. దీంతో మెలకువ రావడం, గాఢ నిద్ర కొరవడుతుంది. ఇలా రాత్రంతా చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. నిద్ర మత్తులో ఇది తెలియదు. శ్వాస ఆగటం, కంటి నిండా నిద్ర పట్టకపోవటం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గటం వల్ల తెల్లారి అలసటగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, నిద్రలేమి, కాళ్లలో చిరచిర వంటి సమస్యలూ దీనికి కారణం కావొచ్చట. నార్కోలెప్సీ, హైపర్సోమ్నియా వంటి నిద్ర రోగాలు కూడా పగటిపూట అలసటగా ఉండడానికి కారణమవుతాయని అధ్యయనం పేర్కొంది.
ఇతర జబ్బులు :
స్లీప్ అప్నియా ఒక్కటే కాదు, దీర్ఘకాల సమస్యలు, హార్మోన్ల మార్పుల వంటివీ ఉదయం పూట నిస్సత్తువకు దారితీయొచ్చు. థైరాయిడ్ సమస్యలు, విటమిన్ల లోపాల వంటివీ హుషారును తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పడకగది వాతావరణం :
బెడ్ రూమ్, చుట్టుపక్కల పరిస్థితులు కూడా నిద్రకు భంగం కలిగించొచ్చట. వెలుగు, ఉష్ణోగ్రత, చప్పుడు. లాంటివీ గాఢ నిద్ర మీద ప్రభావం చూపుతాయని అంటున్నారు. గది చాలా వేడిగా ఉన్నా, వెలుగు మరీ ఎక్కువగా ఉన్నా, ఏదైనా చప్పుడు చేస్తున్నా తెలియకుండానే తరచూ మెలకువ వచ్చేస్తుంది. ఎక్కువ వెలుతురుతో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ మోతాదులు తగ్గి, కునుకు పట్టటాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే, పడకగదిలో టీవీ, పీసీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ల వంటివీ ఉండకుండా చూసుకోవాలని.. ఇవి నిద్రకు విఘాతం కలిగిస్తాయని చెబుతున్నారు.
ఆహారం, పానీయాలు
మనం తినే ఆహారం, తాగే పానీయాలూ గాఢనిద్రను దెబ్బతీయొచ్చని నిపుణులు అంటున్నారు. ఎలాగంటే, పడుకునే ముందు కడుపు నిండా భోజనం చేస్తే, జీర్ణక్రియ ఉత్తేజితమై త్వరగా నిద్ర పట్టకుండా చేయొచ్చట. అందుకే, పడుకోవటానికి రెండు గంటల ముందే భోజనం ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే తక్కువ మొత్తంలో తినటం మేలంటున్నారు. అలాగే, కెఫెన్తో కూడిన కాఫీ, కూల్డ్రింకులు, మద్యం కూడా నిద్రను దెబ్బతీస్తాయట. కెఫెన్ బ్రెయిన్ ను ఉత్తేజితం చేస్తే, మద్యం తరచూ మెలకువ వచ్చేలా చేస్తుంది. చక్కెర, కెఫెన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర డిస్ట్రబ్ అవుతుందని అధ్యయనం పేర్కొంది.
మానసిక సమస్యలు :
మానసిక ఆరోగ్యానికీ, నిద్రకూ విడదీయరాని బంధముంది. నిద్రలేమితో మానసిక సమస్యలు చుట్టుముట్టొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే, మానసిక సమస్యలు నిద్రనూ దెబ్బతీయొచ్చు. ఒత్తిడి, అందోళన వంటివి రాత్రంతా మెదడును చురుకుగా ఉంచేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వతహాగా నిద్ర పట్టే ప్రక్రియ నిలిచిపోతుందట. నిరాశ, దిగులు, డిప్రెషన్ వంటి ఇతర మానసిక సమస్యలూ నిద్రాభంగం కలిగించొచ్చు, తద్వారా, మర్నాడు ఉదయం హుషారు తగ్గిపోయి, అలసటగా అనిపిస్తోంది.
ఐరన్ తగ్గటం :
శరీరంలో ఐరన్ మోతాదులు తగ్గటమూ నీరసానికి కారణమవుతుంది. ఐరన్ లోపంతో రక్తహీనత మాత్రమే కాదు, కాళ్లలో చిరచిర సమస్య కూడా తలెత్తాచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిరచిర సమస్య గలవారికి కాళ్లు కదలకుండా ఉన్నప్పుడు లోపల ఏవో పాకుతున్నట్టు అనిపిస్తుంటుందని అంటున్నారు. దీంతో అదేపనిగా కాళ్లు కదిలించడం వల్ల నిద్రకు విఘాతం కలుగుతుందట.



