డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలే ఈ దేశానికి శరణ్యం
Dr. B. R. Ambedkar's thought processes are the refuge of this country
68 వ వర్ధంతి సభలో ఘన నివాళులు అర్పించిన మంత్రి సుభాస్ తండ్రి వాసంశెట్టి సత్యం.
రామచంద్రపురం డిసెంబర్ 6:
బాబాసాహెబ్ డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ ఆలోచన విధానాలే ఈ దేశానికి శరణ్యమని, ఆ మహనీయన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రపురం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల భాగ్యవిధాత, యావత్ జాతికి నిత్య స్ఫూర్తి ప్రధాత ఐన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆర్థిక వేత్త గా, న్యాయ కోవిదుడుగా, రాజ నీతిజ్ఞుడుగా, సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, డా. బి ఆర్.అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అంటారాని తనం నిర్మూలన, సమ సమాజ స్థాపన, సమాజంలో అందరూ సమానమే అనే నినాదంతో పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కీర్తించారు. ఆ మహనీయుని ఆదర్శాలు, ఆశయాలు మనం కొనసాగించాలని కోరారు. ఆయన బాటలో మనం నడవాలని, రాజ్యాంగంలో మనకోసం పొందుపరిచిన చట్టాలు, ప్రాథమిక హక్కులు, విధులు ప్రతి ఒక్కరూ తెలుసుకోని అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్త్రీలకు ఓటు హక్కు, కార్మిక చట్టాలు రూపకల్పన, ప్రాథమిక హక్కులు, చదువు యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను దేశాలకు చాటి చెప్పిన అపర మేధావి గా ప్రపంచ దేశాలు గుర్తించయన్నారు. ముఖ్యంగా నేటి యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని, చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆ మహనీయుని బాటలో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



