విద్యావేత్త జంగా గోపాల్ కన్నుమూత!
పలువురు ప్రముఖుల నివాళి!
తాడేపల్లిగూడెం
Educationist Janga Gopal passed away!
పట్టణంలో పలు విద్యాసంస్థలు స్థాపించి వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రముఖ విద్యావేత్త , పట్టణ ప్రముఖులు జంగా గోపాల్ (87) మంగళవారం ఉదయం ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు.బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను గతవారం ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.జంగా గోపాల్ స్వస్థలం ఏలూరు తాలూకా పాలగూడెం. జంగా రామారావు , జంగా సత్యనారాయణమ్మ దంపతులకు
ఆయన 1937 జనవరి 4 న జన్మించారు.1958 లో ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాల లో బి.ఎ. పాసయ్యారు. ఆ తర్వాత కొంతకాలం సహకార శాఖలో ఉద్యోగం చేశారు.
ప్రభుత్వోద్యోగానికి స్వస్తి చెప్పి ఏలూరు హోటళ్ల రంగంలో బ్రాండ్ ఇమేజ్ సాధించిన సుప్రసిద్ధ విజయ్ విహార్ హోటలును ఆయన స్థాపించారు. విజయవంతంగా ఏళ్లతరబడి నిర్వహించారు. ఆ తర్వాత 1978 లో ఆయన తాడేపల్లిగూడెం మకాం వచ్చారు. అన్నపూర్ణ హోటల్ ను స్థాపించారు. పత్రికా రంగం మీది ఆసక్తితో ప్రజాసమస్యలు వెలుగులోకి తేవడానికి సంపాదక లేఖలు రాయడం అలవాటు చేసుకున్నారు. 70, 80 దశకాల్లో తెలుగు , ఇంగ్లీష్ దినపత్రికల్లో ఆయన రాసిన సంపాదక లేఖలు క్రమం తప్పకుండా ప్రచురితం అయ్యేవి. స్థానిక పత్రికల్లో కూడా వ్యాసాలు రాసేవారు. 1979 లో తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో గోపాల్స్ కాన్వెంట్ పేరుతో ఇంగ్లీష్ , తెలుగు మీడియం లలో హైస్కూలును స్థాపించారు. ఆతర్వాత సుబ్బారావు పేట లో కింబర్లీ విద్యాసంస్థను , కొబ్బరితోటలో షిరిడీ సాయి స్కూలును స్థాపించారు. వైజ్ ఇంజనీరింగ్ కళాశాల స్థాపనలో పాలు పంచుకున్నారు.
నాలుగున్నర దశాబ్దాలుగా విద్యాబోధనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. తెలుగుసాహితీ సమాఖ్య , వినియోగదారుల సంఘం, వంటి సంస్థలలో బాధ్యతలు చేపట్టి సేవలు అందించారు. ఇంగ్లీషు సామెతలను, నానుడులను, చిన్ని చిన్ని పద్య పాదాలను తెలుగులోకి అనువదించి “భాషా కళ్యాణం” పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. “న్యూ మోడల్ ఎవర్ గ్రీన్ డిక్షనరీ” పేరిట 1544 పేజీల ఇంగ్లీష్ – తెలుగు నిఘంటువును రూపొందించి ప్రచురించారు.
ఆయన సతీమణి శారద రెండేళ్ల క్రితం కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు , ముగ్గురు కుమారులు, మనుమలు , మనుమరాళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస రామ్ రాయ్ షిరిడీ సాయి విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మునిసిపల్ కౌన్సిలర్ గా సేవలు అందించారు. రెండో కుమారుడు సూర్య ప్రకాశ్ బాలాజీ కింబర్లీ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. అపుస్మా లో రాష్ట్ర, జిల్లాస్థాయి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మూడో కుమారుడు వెంకట్ ఏలూరులో సాయిరామ్ నర్సరీ నిర్వహిస్తున్నారు. జంగా గోపాల్ భౌతిక కాయాన్ని ఏలూరు నుండి మంగళవారం ఉదయం 10 గంటలకు కింబర్లీ విద్యాసంస్థల ఆవరణకు తీసుకు వచ్చారు.
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ , శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ , బుద్ధాల వెంకటరామారావు , దూసనపూడి సోమసుందర్ , భోగిరెడ్డి ఆదిలక్ష్మి , సహా పలువురు పట్టణ ప్రముఖులు , జిల్లా నలుమూలల నుండి వచ్చిన విద్యాసంస్థల అధినేతలు జంగా గోపాల్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.



