
ఎస్కేఎం అధ్వర్యంలో హైదరాబాద్ లో కేంద్రం, హర్యానా ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్, ఫిబ్రవరి23 వాయిస్ టుడే ప్రతినిధి(సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి వీరాంజనేయులు).
యువ రైతు శుభకరన్ సింగ్ ను పంజాబ్ బార్డర్ లో కేంద్రం, హర్యానా రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు క్రూరంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (యస్ కె యం), కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య పార్క్ వద్ద
ప్రభుత్వాల దిష్టి బొమ్మ దహనం జరిగింది.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి, హర్యానా ముఖ్యమంత్రి పై హత్యానేరం మోపాలని, రైతాంగ ఉద్యమం పై నిర్బంధాన్ని ఆపాలని,కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు.
అనంతరం ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, కన్వీనర్ లు ఉపేందర్ రెడ్డి,మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఝాన్సీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. అమరవీరుడు యువ రైతు శుభకరన్ సింగ్కు జోహార్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో రైతు పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటాన్ని అణిచివేసేందుకు వ్యతిరేకంగా దేశం అంతటా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. రైతుల నిరసన స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేశారన్నారు. రైతులపై అణచివేత ప్రయోగించడం, రైతు ఉద్యమాన్ని ఏకాకిని చేసి విభజించేందుకు కుట్ర పన్నారని, ఈ విభజనతో ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, మనోహర్ లాల్ ఖట్టర్, అనిల్ విజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను చంపి, గాయపరిచినందుకు, నిరసన స్థలంలో అనేక ట్రాక్టర్లను ధ్వంసం చేసినందుకు పంజాబ్ ప్రభుత్వానికి, హర్యానా పోలీసులకు వ్యతిరేకంగా సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాల్పులు, ట్రాక్టర్లకు జరిగిన నష్టంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పాడైన 100 ట్రాక్టర్ల మరమ్మతు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 26న జాతీయ రహదారుల పై ట్రాక్టర్ లు, వాహనాల ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో జరిగే ఆందోళనలో పార్టీల కతీతంగా రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, బొంతు రాంబాబు, ఈసంపెల్లి బాబు, చుక్కయ్య, బ్రహ్మం, జగన్ (వ్యవసాయ కార్మిక సంఘం),పద్మ,అరుణ(ఐ ఎఫ్ టి యు),అనగంటి వెంకటేశ్,కోట రమేష్ (డివైఎఫ్ ఐ), మహేష్ (పిడియస్ యు) తదితరులు పాల్గొన్నారు



