
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అర్తం గ్రామంలో ఏనుగు హల్ చల్ చేసింది. అరణ్యం నుంచి రహదారిపైకి వచ్చి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ప్రైవేటు బస్సును అడ్డుకుని తల ఢీకొట్టింది. కసి తీరా బస్సు అద్దాలను ధ్వంసం చేసింది. మూడు మీటర్ల మేర బస్సును వెనక్కి నెట్టివేసింది. బస్సు రాయగఢ నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అంతేకాదు స్థానికంగా ఉన్న ఇంటిపైనా దాడి చేసింది. అక్కడ పార్క్ బైకులను కిందపడేసి కాళ్లతో తొక్కింది. దీంతో స్థానికులతో పాటు బస్సు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.అయితే స్థానిక అటవీప్రాంతంలో చాలా రోజులుగా 6 ఏనుగులు సంచరిస్తున్నాయని స్థానిక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వీటిలో హరి అనే మగ ఏనుగు ఒంటరిగా సంచరిస్తూ పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోందని అంటున్నారు. గతంలో కూడా పలుచోట్ల ఆస్తి నష్టం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని కొంతకాలం చర్యలు చేపట్టారని.. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.




