విశాఖ సాగరతీరం యుద్ద విన్యాసాలతో దద్దరిల్లింది.నేవీ సిబ్బంది దైర్యసాహసాలు అబ్బుర పరిచాయి.ఏటా జరిగే నేవీ డేలో బాగంగా ఈ సారి కూడా నేవీ సిబ్బంది విన్యాసాలతో ఆకట్టుకున్నారు.ఉగ్ర మూకలు దేశంపై విరుచుకుపడే సమయంలో చూపించే తెగువను సిబ్బంది కళ్లకు కట్టించారు. నేవీ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీజ్ లో భారత నౌకాదళ వాయు విభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్,మంత్రులు అమర్,రజిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు. వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఇతర అధికారులు కూడా హాజరయారు.తూర్పు నౌకాదళం కమాండ్ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు ప్రదర్శించారు. ఇందులో భాగంగా భారత నౌకాదళం ప్రతిభా పాట వాలు, పరాక్రమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను ఆశ్చర్యపరిచారు.

నేవీ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, జలాంతర్గాములు, హెలికాఫ్టర్లతో సిబ్బంది విన్యాసాలు చేశారు. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలిరాగా, ఆర్కే బీచ్ జన సందోహంగా మారింది. నేవీ డే సందర్భంగా ఆర్కే బీచ్ కు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.భారత్ – పాక్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మిగ్ జాం తుపాను కారణంగా 10వ తేదీకి నేవీ డే ఉత్సవాలను వాయిదా వేశారు.ఈ ఏడాది ఘనంగా జరిగిన వేడుకలను చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో సాగర్ తీరమంతా జనంతో కిక్కిరిసిపోయింది.నేవీ డే సందర్భంగా సముద్రంపై నౌకలు,హెలికాఫ్టర్లు,విమానాల ద్వారా విన్యాసాలు చేయడం ఎలా మట్టి కరిపిస్తున్నారో స్వయంగా వీక్షించే అవకాశం ప్రజలకు దక్కడంతో సాగర్ తీరమంతా జనంతో నిండిపో యారు.



