ఢిల్లీలో ఎంబసీ వద్ద పేలుళ్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 27
ఢిల్లీలోని ఇజ్రాయేల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన అలజడి సృష్టించింది. ఇది కచ్చితంగా ఉగ్రదాడే అని ఇజ్రాయేల్ ఇప్పటికే తేల్చి చెప్పింది. భారత్లో ఉన్న ఇజ్రాయేల్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్కెట్లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దని చెప్పింది. ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన చిహ్నాలనూ ఎక్కడా ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్లు పెట్టకూడదని చెప్పింది. డిసెంబర్ 26న సాయంత్రం చాణక్యపురిలో ఉన్న ఎంబసీ వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఓ లెటర్ దొరికింది. ఇజ్రాయేల్ అంబాసిడర్ని తిడుతూ ఆ లేఖ రాశారు. ఘటనా స్థలానికి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్తో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేరుకుని అన్ని విధాలుగా పరిశీలించింది. సిబ్బంది కూడా అన్ని విధాలుగా దర్యాప్తు మొదలు పెట్టింది. NIAతో పాటు NSG కమాండోలు, ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా విచారణకు సహకరిస్తోంది. పోలీస్ టీమ్స్తో పాటు Canine Unit విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియకపోయినా…జెండాలో పెట్టి ఉన్న లెటర్ని మాత్రం స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయేల్ విదేశాంగ మంత్రి స్పందించారు. ఈ ఘటనలో ఎంబసీలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదని ధ్రువీకరించారు. ఇజ్రాయేల్ సెక్యూరిటీ ఫోర్సెస్ విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. గాజాపై ఎయిర్ స్ట్రైక్ల తీవ్రతను అంతకంతకూ పెంచుతోంది ఇజ్రాయేల్ సైన్యం. ఇప్పటికే గాజా పూర్తిగా ధ్వంసమైంది. బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్నారు. అక్టోబర్ 7న హమాస్ దాడులతో మొదలైన ఈ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. అయితే…హమాస్ని అంతం చేయడానికి ఇజ్రాయేల్ “Dumb Bombs”ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా చెందిన Director of National Intelligence ఆఫీస్ ఈ రిపోర్ట్ని విడుదల చేసింది. CNN వెల్లడించిన వివరాల ప్రకారం…ఇజ్రాయేల్ చేసిన దాడుల్లో 45% మేర ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 29 వేల ఆయుధాలను వినియోగించింది. అయితే..ఈ దాడుల తీవ్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ మొత్తంలో ప్రాణనష్టం నమోదయ్యే ప్రమాదముందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే గాజాపై ఇలాంటి దాడులు చేయడం వల్ల ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.



