
ఎడతెరిపిలేని వర్షాలు తో ఏజెన్సీ అతలాకుతలం ! పెరుగుతున్న గోదావరి వరద
పలు కాలనీలు జలమయం !
( గిరి ప్రసాద్ సోముల, సీనియర్ జర్నలిస్ట్ ) : రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతోంది. ప్రజాజీవనం పూర్తిగా స్తంభించింది. గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి కి చేరువగా ప్రవహిస్తోంది. బుధవారం సాయంత్రం 47 అడుగులు ఉండగా, రాత్రి 10 గంటల సమయానికి 48 అడుగులకు చేరవచ్చునని అధికారులు తెలిపారు. గోదావరి నుండి 10 లక్షల 59 వేల 950 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముంపుకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వరద ఉదృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. చర్ల మండలం లోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తీవ్రం గా ఉంది.
ప్రాజెక్ట్ 19 గేట్లను ఎత్తి వేసి 1,54,092 క్యూసెక్కులు నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, బుధవారం సాయంత్రం 73.44 మీటర్లు కు చేరినట్లు తెలుస్తోంది. 1,42,595 క్యూసెక్కుల నీరు ఐన్ ఫ్లో అవుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. వరద పరిస్థితి పర్యవేక్షణ ప్రత్యేక అధికారి అనుదీప్ తాలిపేరు ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి ని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండి, అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని కలెక్టర్ ప్రియాంక అలా కోరారు. ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు దాటొద్దని చెప్పారు. రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు రవాణా చేయడానికి అవకాశం లేకుండా బారికేడింగ్, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని రెవిన్యూ, పంచాయతి రాజ్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, గోదావరి వరద ఇంకా పెరిగే ప్రమాదమున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం నుండి దిగువ ప్రాంతాలైన కూనవరం, వి ఆర్ పురం, చింతూరు, వేలేరుపాడు, కుక్కు నూరు మండలాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సామాన్లు సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 2022 లో సంభవించిన వరదల దృష్టిలో పెట్టుకొని ముంపు ప్రాంతాల ప్రజల తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. భద్రాచలం పట్టణం లోని పలు కాలనీల్లో కి వర్షపు నీరు చేరి జలమయమయ్యాయి. రామాలయం పరిసర ప్రాంతం లో కి భారీ గా వరద నీరు చేరింది. అక్కడి ప్రజలు తమను రక్షించాలని కోరుతున్నారు. భద్రాచలం లోని గోదావరి కరకట్ట స్లూయిస్ లుకు ముందస్తు గా మరమత్తులు చేయనండున కొద్ది పాటి వరద కే పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. అశోక్ నగర్ కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్, శిల్పి నగర్ కాలనీ తదితర కల్నీలోకికి వరద నీరు చేరుకుంది. అధికారుల ముందు చూపు తో నివారణ చర్యలు తీసుకోకపోవడం తో ప్రతి ఏటా తాము ముంపు కి గురై తీవ్రం గా నష్ట పోవాల్సి వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నారు. గోదావరి వరద నీటిమట్టం మరికొంత పెరిగితే భద్రాచలం నుండి ఇతర ప్రాంతాలు కు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కలెక్టర్ ప్రియాంక అలా, జాయింట్ కలెక్టర్ కే. వేంకటేశ్వర్లు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ ప్రియాంక పర్యటించి సత్వర చర్యలు కు స్థానిక అధికారులకు సూచనలు చేసేరు. భద్రాచలం లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తం గా ఉండి అవసరమైతే 100 కి డయల్ చేయాలని ఎస్పీ వినీత్, ఎ ఎస్పీ పంకజ్ సంతోష్ విజ్ఞప్తి చేసేరు. మండల కేంద్రాల్లో వరద సహాయక చర్యల కోసం కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏజెన్సీ ప్రాంతం లోని చెరువులు పొంగిపొర్లడం తో రోడ్ల పైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.



