తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల అకాల వర్షాలు కురిశాయి. దీనివల్ల చాలాచోట్ల పంట నష్టం జరిగింది. చేతికి వచ్చిన సమయంలో పంటంతా రాలిపోయింది. బత్తాయి, నిమ్మ, మామిడి లాంటి ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వరి ధాన్యం అయితే పంటపొలంలోనే మొలకలొచ్చాయి. ఈ తరుణంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వచ్చింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎకరానికి రూ.10వేల చొప్పున
మంత్రులు కూడా పర్యటించి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. 15,246 మంది రైతులకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించనుంది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారం డబ్బులు జమ చేయబోతున్నారు. రైతు రుణమాఫీ, వరికి రూ. 500 బోనస్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటామని, ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. వరికి ప్రకటించిన రూ.500 బోనస్ కూడా వచ్చే సీజన్ నుంచి అందజేయనున్నారు.


