ఏప్రిల్ లోనే గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ
విశాఖపట్టణం, ఏప్రిల్ 2, (వాయిస్ టుడే )
Google data center groundbreaking ceremony to be held in April
విశాఖపట్నం జిల్లాలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా భూములలో జంగల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు కూడా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి ఈ నెలలోనే భూమి పూజ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.విశాఖపట్నం జిల్లాలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆనందపురం మండలంలోని తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూముల్లో అధికారులు జంగల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. డేటా సెంటర్ కోసం తర్లువాడలోని సర్వేనంబర్ ఒకటిలో ఉన్న 308 ఎకరాలను ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థకు కేటాయించింది. అలాగే ఆయా భూముల రైతులకు ఇప్పటికే నష్టపరిహారాన్ని జమ చేసింది. గూగుల్ డేటా సెంటర్కు కేటాయించిన భూములలో మామిడి, జీడి మామిడి వంటి తోటలు, ఇతర చెట్లు ఉన్నాయి. వీటిని తొలగించే పనిని ఏపీ ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది.ఏపీఐఐసీ ఓ కాంట్రాక్టర్కు ల్యాండ్ స్కేపింగ్ పనులు అప్పగించింది. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్ట్ సంస్థ జంగల్ క్లియరెన్స్ పనులు చేపట్టగా.. మెజారిటీ పనులు పూర్తయ్యాయి. భూమిని చదును చేయాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్ నెలలోనే గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పనులు వేగవంతం చేశారు. మరోవైపు గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థ కలిసి 1000 మెగావాట్ల సామర్థ్యంతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఈ డేటా సెంటర్ కోసం15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం తొలుత విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 480 ఎకరాలు కేటాయించింది. అయితే గూగుల్ ప్రతినిధులు అదనపు భూములు కోరటంతో.. ఏపీ ప్రభుత్వం రాంబిల్లిలో 174.8 ఎకరాలు, తర్లువాడ లో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలను కలిపి 601.4 ఎకరాలను కేటాయించింది. ముందుగా అనుకున్న ప్రకారం తొలుత తర్లువాడలో డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్ల కోసం ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఇటీవలే విశాఖపట్నంలో పర్యటించారు. ఏపీఐఐసీ అధికారులతో తర్లువాడ భూములను పరిశీలించారు. ఈ క్రమంలోనే జంగల్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేశారు.



