చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Government benefits for Chennamaneni should be stopped - Aadi Srinivas
హైదరాబాద్, ఏప్రిల్ 21
వేములవాడ 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో న్యాయం గెలిచిందని పిటిషనర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేని రమేష్ తప్పుడు ధ్రువ పత్రాలతో న్యాయస్థానాలను, ప్రభుత్వాలను మోసం చేశారని… ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో హైకోర్టు చెన్నమనేని రమేష్ భారత దేశ పౌరుడు కాదని తీర్పు ఇచ్చిందన్నారు. దాంతో పాటు 15 ఏళ్ల పాటు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్న తనకు 25 లక్షల రూపాయలు, లీగల్ సెల్ కు 5 లక్షల రూపాయలు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే.హైకోర్టు తీర్పుతో ఈరోజు చెన్నమనేని రమేష్ 25 లక్షలు తన లాయర్ల ద్వారా ఆది శ్రీనివాస్కు డీడీ అందించారు. దాంతో పాటు కోర్టు తీర్పు ప్రకారం 5 లక్షల రూపాయలు తన లీగల్ సెల్ కు కూడా చెల్లించారని ఆది శ్రీనివాస్ తెలిపారు. చెన్నమనేని రమేష్ 4 సార్లు ప్రజలను మోసం చేసి గెలిచారని.. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై డీజీపికి ఇదివరకే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వేములవాడ ప్రజలను మోసం చేసినందుకు చెన్నమనేని రమేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2009 నుండి 2023 వరకు మోసం చేసి గెలిచినందున, ఆయన ఎమ్మెల్యే కాదని గెజిట్ నోట్ విడుదల చెయ్యాలని ఆది శ్రీనివాస్ కోరారు. మాజీ ఎమ్మెల్యే కూడా కాకుండా అతనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చూడాలన్నారు. మోసం చేసి గెలిచిన వ్యక్తి కనుక ఆ సమయంలో ఎమ్మెల్యే కాదు అని హైకోర్టు స్పష్టం చేసిందని, దాంతో ఆయన మాజీ ఎమ్మెల్యే ఎలా అవుతారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇన్నాళ్లపాటు న్యాయపోరాటం చేస్తున్న తన కేసును వాదించిన సీనియర్ కౌన్సిల్ వి. రవి కిరణ్ రావు, రోహిత్ రావు లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు గత ఏడాది డిసెంబర్ నెలలో బిగ్ షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆయన జర్మనీ పౌరుడేనని, ఇన్నాళ్లు మోసం చేశాడని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జర్మనీ పౌరుడిగా ఉంటూనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని కోర్టు స్పష్టం చేసింది. తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లు మోసం చేసిన చెన్నమనేని రమేష్ కు హైకోర్టు రూ.30 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
చెన్నమనేని రమేశ్ తప్పుడు ధ్రువపత్రాలు, సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పలు మార్లు కోర్టును ఆశ్రయించారు. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడని, ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సాగింది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేయడం తెలిసిందే. దీన్ని చెన్నమనేని హైకోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన హైకోర్టు ఆయన జర్మనీ పౌరుడని, ఆయన ఎన్నికల చెల్లదని గతంలోనూ ఎమ్మెల్యేగా పరిగణించకూడదని తీర్పు వెలువరించింది.