నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకే మళ్ళీ గ్రామ సభలు
Gram sabhas again to select the true deserving ones
– మొదటి జాబితాలో పేర్లు రాని వారు ఈ సభల్లో నమోదు చేసుకోవచ్చు
– తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఖమ్మం
నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం మోటపురం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, పైనంపల్లి, అప్పలనర్సింహాపురం, కట్టుకాచారం, కొంగర, బుద్దరాం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి ప్రసంగించారు. గతంలో జరిగిన గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చి ప్రస్తుతం ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాకపోతే ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసమే మళ్లీ ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నాలుగు రోజులు పాటు విడతల వారీగా ఆయా గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే వారిలో నిజమైన అర్హులు ఉంటే వారికి వెంటనే పథకాలను అందించడం జరుగుతుందన్నారు. రెచ్చగొట్టే మాటలను ఈ ప్రభుత్వం పట్టించుకోదని చిత్తశుద్ధితో పనిచేయడమే ఈ ప్రభుత్వానికి తెలుసన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామాల్లో ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, మద్దినేని బేబి స్వర్ణ కుమారి, ఆర్డీవో నర్సింహారావు, స్పెషల్ ఆఫీసర్ రమేష్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.



