గోల్కొండ బోనాలకు ఘన శ్రీకారం.. అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రులు
జగదాంబిక ఆలయ కమిటీకి రూ.11 లక్షల చెక్కు అందజేత
హైదరాబాద్, జూలై 16 : వాయిస్ టుడే
Grand commencement of Golconda Bonalu; Ministers offer the first Bonam to the Goddess.

గోల్కొండ కోట శ్రీ జగదాంబిక అమ్మవారి ఆషాఢ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లంగర్హౌస్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజల సుఖశాంతి, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాఢ బోనాల ఉత్సవాల బుక్లెట్ను ఇరువురు మంత్రులు ఆవిష్కరించారు. అలాగే గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాద్ పండుగ వాతావరణంలో మునిగిపోయిందని ఆమె అన్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద దేవాలయాలతో పాటు చిన్న ఆలయాల అభివృద్ధికీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




