కాళేశ్వరం పై హైకోర్టు కీలక తీర్పు: కమిషన్ నివేదిక చెల్లదు – ఎంపీ వద్దిరాజు హర్షం
High Court Delivers Key Verdict on Kaleshwaram: Commission Report Invalid – MP Vaddiraju Expresses Delight
కాళేశ్వరం సాగునీటి పథకానికి సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్వాగతించారు.
కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని ఎటువంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. విచారణ సందర్భంగా ప్రాథమిక న్యాయ సూత్రాలు, నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో ఆ నివేదికకు చట్టబద్ధత లేదని తేటతెల్లమైందని వివరించారు.
ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హైకోర్టు పేర్కొన్నదని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులపై రాజకీయ ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను ఉపయోగించి వేధింపులకు పాల్పడడం అభ్యంతరకరమని ఆయన విమర్శించారు.
తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరాధార ప్రచారాలతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో ప్రారంభించకుండా రెండున్నరేళ్లు ఆలస్యం చేసి, ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో చేపట్టారని ఆరోపించారు.
కేసీఆర్, హరీష్ రావులపై చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తాజా తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరిలో మార్పు రావాలని ఆయన సూచించారు.
అంతిమంగా న్యాయం, ధర్మమే గెలుస్తాయని హైకోర్టు తీర్పు నిరూపించిందని, ఇది పాలకులకు చెంపపెట్టు వంటిదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.



