వెలుగమట్ల బాధితులకు అక్కడే ఇళ్లు
ఖమ్మం, మార్చి 11
Houses for Velugamatla victims right there.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. కూల్చిన చోటే బాధితులకు స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఇప్పటికే అర్హులైన బాధితులను గుర్తించిన అధికారులు నేడు పట్టాలు పంపిణీ చేయనున్నారు. మెుత్తం 412 మంది బాధితులకు పట్టాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం హాట్ టాఫిక్గా మారిన సంగతి తెలిసిందే. అక్కడ కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. అవి ప్రభుత్వ భూములని పేర్కొంటూ పది రోజుల క్రితం రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. దీంతో వందల కుటుంబాలు నిరాశ్రయులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అర్హులైన కుటుంబాలకు అందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.ఇళ్లు నేలమట్టం చేసిన ప్రాంతాన్ని చదును చేసే పనులను మంగళవారం ప్రారంభించింది. కొద్దిరోజులుగా రెవెన్యూ అధికారులు జరిపిన సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా అర్హులైన బాధితులను గుర్తించింది. వారికి ఇంటి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్లను బుధవారం మంజూరు చేయనుంది. ఈ మేరకు నేడు ఖమ్మం కలెక్టరేట్లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధి వినోబాభావే నగర్లోని భూదాన్ భూమిలో మెుత్తం 742 కుటుంబాలకు చెందిన ఇళ్లను ఫిబ్రవరి 24న అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని.. హైకోర్టు, సీసీఎల్ఏ ఆదేశాల మేరకు వాటిని తొలగించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. దీంతో ఇళ్లు కోల్పోయిన బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. 134కు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారు అంబేడ్కర్, టీటీడీసీ భవనాల్లోనే తాత్కాలికంగా తలదాచుకుంటున్నాయి.బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఈ ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో అర్హులను గుర్తించటానికి రెవెన్యూ అధికారులు కూల్చివేత చిత్రాలు, ఆధార్, రేషన్కార్డుల ఆధారంగా వారి అడ్రస్లు సేకరించారు. ఫీల్డ్ సర్వేలో మొత్తం 412 కుటుంబాలు అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు వారికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే టోకెన్లు పంపిణీ చేశారు. నేడు బాధితులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.



