రమణారెడ్డి ఇంటిని మఫ్టీలో పోలీసులు చుట్టుముట్టారు….. అరెస్ట్
కామారెడ్డి జిల్లా, ఆగస్టు 31: బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి నిర్వహించ తలపెట్టిన చలో గజ్వేల్ కార్యక్రమాన్ని 12 గంటల ముందే పోలీసులు భగ్నం చేశారు. రేపటి కార్యక్రమానికి సన్నద్ధం అవుతుండగా పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు రమణారెడ్డి ఇంటిని మఫ్టీలో పోలీసులు చుట్టుముట్టారు. సుమారు రెండు గంటల పాటు చుట్టూ పహారా కాసిన పోలీసులు కార్యకర్తలు లేని సమయంలో రమణారెడ్డి ఇంటికి చేరుకుని అరెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న కార్యకర్తలు రమణారెడ్డి అరెస్టు కాకుండా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ వెళ్తే తప్పా అని ప్రశ్నించారు. తాము ఎలాంటి ఆందోళనలు చేపట్టడం లేదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన గజ్వేల్ యాత్ర ఆగదన్నారు. ఇవాళ కాకపోయినా రేపయినా గజ్వేల్ వెళ్లి తీరుతామన్నారు. అక్రమ అరెస్టులు చేస్తే గజ్వేల్ లో అభివృద్ధి లేదని ఒప్పుకున్నట్టేనన్నారు.



