తలసాని చాలెంజ్
హైదరాబాద్, అక్టోబరు 2: తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఇళ్లను పేద, మధ్యతరగతి ప్రజలకు పంపిణీ చేసింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విధంగా దేశంలో ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరగట్లేదు.. ఎక్కడైనా నిర్మించినట్లు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తా అంటూ ప్రకటించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పారదర్శకంగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. పైరవీలు, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పేద వాళ్ల కోసం పనిచేస్తుందన్నారు. గతంలో కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఛాలెంజ్ విషయంలో ఇలానే వ్యవహరించారు. కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సవాల్ విసిరిన తలసాని తన కార్లోనే డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించి.. హాట్ టాపిక్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో రాజీనామా సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది.



