ఐక్యతతో ముందుకు సాగితే రాజ్యాధికారం తథ్యం … ఎంపీ వద్దిరాజు…
మున్నూరుకాపు సంఘం ఒక రోజు ఓరియేంటేషన్ శిక్షణా శిబిరం
హైదరాబాద్ :వాయిస్ టుడే
If we move forward with unity, the sovereignty of the state will be established... MP Vaddiraju...

ఐక్యత, క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్షతో ముందుకు సాగితే బహుజనులకు రాజ్యాధికారం సిద్ధించడం తథ్యమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఇందుకుగాను మనమందరం మరింత ఐకమత్యంతో ఇతర కులాల వారితో స్నేహంగా, పరస్పర సహకారంతో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుద్దామని పిలుపునిచ్చారు. మున్నూరుకాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యాన మంగళవారం ఒకరోజు ఓరియేంటేషన్ శిక్షణా శిబిరం ఏర్పాటైంది. హైదరాబాద్ చందానగర్ లోని సుప్రజా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ అధ్యక్షత వహించగా, ఎంపీ రవిచంద్ర, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. మన సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారున్నారని, అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందున మూడేళ్ల వరకు అటువైపుగా ఆలోచించకుండా సంఘం బలోపేతానికి, అభ్యున్నతికి పని చేద్దామన్నారు. పదవుల కోసం కాకుండా పని చేయడంపైనే దృష్టి సారించవలసిందిగా ఎంపీ వద్దిరాజు పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా జనగణన, కులగణన జరిగిన తర్వాత చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్స్ మహిళలతో పాటుగా అమలు కావడం అనివార్యమని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. ఆ ఫలాలను అందిపుచ్చుకునేందుకు మనమందరం సంసిద్ధంగా ఉండాలన్నారు. మన సంఘం అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వీ.ప్రకాష్, సీ.విఠల్, రౌతు కనకయ్యల నేతృత్వంలో భారత రాజ్యాంగం మాదిరిగా మంచి విధి విధానాలను రూపొందించుకున్నదని ఎంపీ రవిచంద్ర వివరించారు. నాగార్జునసాగర్ లో జరిగిన రెండు రోజుల శిక్షణా శిబిరం గురించి తెలుగు రాష్ట్రాలలో గొప్ప చర్చకు దారితీసిందని ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు. ఇదేవిధమైన శిక్షణా శిబిరాలు మున్ముందు మరిన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ శిబిరంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వీ.ప్రకాష్, సీ.విఠల్, రౌతు కనకయ్య, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్,ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ తదితర ప్రముఖులు మాట్లాడారు. కార్యక్రమంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు గాలి అనిల్ కుమార్, మీసాల చంద్రయ్య, సత్తు మల్లేష్, సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, కోశాధికారి కంచె సత్యనారాయణ, కార్యనిర్వహక అధ్యక్షులు డాక్టర్ జే.ఏన్.వెంకట్, చల్లా హరిశంకర్, బుక్కా వేణుగోపాల్, మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మక్క, బత్తుల సిద్ధేశ్వర్, లవంగాల అనిల్,వాసాల వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కాచిగూడ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహాన్ని, స్థలాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి విముక్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సర్థార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, సుప్రజా గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత తూడి ప్రవీణ్, జూలూరు గౌరీశంకర్ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”, “జై మున్నూరుకాపు జైజై మున్నూరుకాపు”,”వర్థిల్లాలి వర్థిల్లాలి మున్నూరుకాపుల ఐక్యత వర్ధిల్లాలి”అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.


