ఇరాన్ వార్ ఎఫెక్ట్.. త్వరలో 10-12 శాతం బీర్ల ధరలు పెరిగే ఛాన్స్…
న్యూ డిల్లీ మార్చ్ 25
Impact of the Iran War: Beer prices likely to rise by 10–12% soon.
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఇండియాలో చమురు సంక్షోభం మొదలైంది. త్వరలో ఎరువుల కొరత వేధించే అవకాశం ఉంది. మరోవైపు ఔషధాల ధరలు కూడా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్స్కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇండియాలో త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విదేశీ బ్రాండ్లు తమ బీర్ల ధరల్ని పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ యుద్ధం కారణంగా రవాణా స్తంభించిపోవడమే దీనికి ప్రధాన కారణం. బీర్ల తయారీలో వాడే గ్లాస్ బాటిల్స్, అల్యూమినియం క్యాన్ల తయారీకి అవసరమైన ముడిసరుకు విదేశాల నుంచే వస్తుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా రవాణా నిలిచిపోయి, వీటి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో బీర్ల తయారీ కంపెనీలపై అదనపు భారం పడుతోంది. మరోవైపు చమురు ధరలు పెరగడం కూడా బీర్ల తయారీపై ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో నాలుగోవంతు నేచురల్ గ్యాస్ను ఇండియా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అది కూడా ఎక్కువగా పశ్చిమాసియా నుంచే వస్తుంది. అందులోనూ ఖతార్ నుంచే 40 శాతం చమురు దిగుమతి అవుతుంటుంది. కానీ, ఇప్పుడు గ్యాస్ సరఫరా లేక చమురు ధరలు పెరగడం, బాటిల్స్ సరఫరా నిలిచిపోవడంతో బీర్ల తయారీ కంపెనీలపై అదనపు భారం పడుతోంది. ఈ కారణంగా గ్లాస్ బాటిల్ ధరలు 20 శాతం పెరిగాయి. అలాగే, బీర్లను ఉంచే పేపర్ కార్టన్ రేట్లు కూడా రెట్టింపైనట్లు తయారీ కంపెనీలు చెబుతున్నాయి.లేబుల్స్, టేప్స్ వంటి ధరలు కూడా పెరిగాయి. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా లేకపోవడంతో వీటన్నింటి తయారీ సంస్థలు తమ తయారీని తగ్గించాయి. ఫలితంగానే రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీర్ల ధరలు పెంచాలని ప్రయత్నిస్తున్నట్లు తయారీదారులు పేర్కొంటున్నారు. వేసవి కాలం కావడం, డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమపై భారం తగ్గాలంటే 12 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని ప్రభుత్వాల్ని కోరుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాలు అంగీకరిస్తే త్వరలోనే బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.



