మంత్రి ఆదేశాలను అమలు చేయండి. కేబుల్ చానెల్స్ కు ఐ అండ్ పీఆర్ లో అక్రేడిటేషన్స్ ఇవ్వండి.
కమిషనర్ ప్రియాంకకు టీయూ డబ్ల్యూ జే, కేబుల్ జర్నలిస్టుల జేఏసీ నేతల వినతి
Implement the Minister’s orders. Give accreditations to cable channels in I&PR.
హైదరాబాద్: కేబుల్ చానెల్స్ కు గతంలో లాగే ఐ అండ్ పీఆర్ లో అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్ ప్రియాంక హామీ ఇచ్చారు. సవరించిన జీ.ఓ లో సైతం కేబుల్ చానెల్స్ కు జరిగిన అన్యాయాన్ని టీయూ డబ్ల్యూ జే, కేబుల్ చానెల్స్ జేఏసీ నేతలు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు. జీ.ఓ 239 లో కేబుల్ చానెల్స్ కు ఇచ్చిన అక్రెడిటేషన్స్ వివరాలను ఈ సందర్భంగా యూనియన్ నేతలు కమిషనర్ కు వివరించారు. కేబుల్ ఛానెల్స్ కు జరుగుతున్న అన్యాయాన్ని టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్ క్షుణ్ణంగా వివరించారు. గతంలో ఇదే విషయాన్ని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పాత జీ ఓ ప్రకారం కేబుల్ జర్నలిస్టులకు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కమిషనర్ కు తెలిపారు. దీంతో స్పందించిన కమిషనర్ ఇదే విషయాన్ని మరో మారు మంత్రితో చర్చించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 15 సంవత్సరాల జర్నలిస్టుగా అనుభవం కలిగిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కూడా ఫ్రీ లాన్స్ జర్నలిస్టులుగా అవకాశం కల్పించాలని,ప్రస్తుతం కేవలం ప్రింట్ మీడియా వారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారని కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో కూడా సానుకూలంగా స్పందించిన కమిషనర్ తప్పకుండా వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. అక్రెడిటేషన్స్ జారీలో కేబుల్ చానెల్స్ కు న్యాయం చేసేలా త్వరలో సవరణలు చేస్తామని కమిషనర్ ప్రియాంక స్పష్టం చేశారు. కమిషనర్ ను కలిసిన వారిలో టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయూ డబ్ల్యూ జే కోశాధికారి పి.యోగనంద్, కేబుల్ చానెల్స్ జేఏసీ నేతలు కడకంచి వెంకటేష్, హెచ్.వి చలపతి రాజు, దేవేందర్, భరత్, అరవింద్ తదితరులు ఉన్నారు.



