నిజామాబాద్ కు మోడీ
నిజామాబాద్, అక్టోబరు 2: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ( అక్టోబర్ 3వ తారీఖు) నిజామాబాద్ కు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు. అనంతరం గవర్నమెంటు ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అని ఆయన చెప్పారు. వర్షం కురిసినా ఇబ్బందిలేకుండా రెండు లక్షల మంది కూర్చునేలా సభను ఏర్పాటు చేసినట్లు ఎంపీ అర్వింద్ వెల్లడించారు.అయితే, ఈ సభకు మొదట ఇందూరు జనగర్జన పేరు పెట్టారు.. కానీ, పాలమూరు వేదికగా రాష్ట్రానికి ప్రధాని మోడీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో సభను ధన్యవాద్ సభగా మార్చినట్లు బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు.

రైతులు అధిక సంఖ్యలో వచ్చి పసుపు బోర్డు ఇస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలుపాలని ఎంపీ అర్వింద్ కోరారు. ఇక, నేడు (సోమవారం) గ్రౌండ్ మొత్తం ఎస్పీజీ అధికారుల కంట్రోల్లోకి వెళ్లనుంది. వారి ఆధీనంలోకి వెళ్లాక వ్యక్తుల రాకపోకలపై నిఘా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త కలెక్టరేట్లోని హెలిపాడ్లో హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యాక ప్రత్యేక మార్గంలో ప్రధాని మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ఐదు నిమిషాల్లో చేరుకుంటారు. మొత్తం 2 వేలకు పైగా పోలీసులు ప్రధాని బందోబస్తులో పాల్గొన్నారు.అయితే, ప్రధాని మోడీకి చేరువలో ఉండే వ్యక్తులకు ప్రత్యేక పాస్లు ఎస్పీజీ సిఫారసు మేరకు జిల్లా పోలీసులు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ వచ్చాక ప్రధాని మోడీ 2 గంటల పాటు ఉండనున్నారు. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. బీజేపీ సభకు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆంక్షలు, ప్రతి ఒక్కరి కదలికలపై ఎస్పీజీ అధికారులు నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ ను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించారు. 2 వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చూస్తున్నారు. సభా స్ధలీ, హెలిప్యాడ్ స్ధలాన్ని తమ ఆధీనంలో కేంద్ర బలగాలు, ఎస్పీజీ అధికారులు తీసుకున్నారు


