పాలన బలంగా ఉంటేనే పెట్టుబడులు బలంగా వస్తాయి: పవన్ కళ్యాణ్
Investments will flow in robustly only if governance is strong: Pawan Kalyan
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిత్తల్–నిప్పన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని, ప్రస్తుతం పెట్టుబడులు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయని అన్నారు. కూటమి పాలనలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నమ్మకం పెంచామని తెలిపారు.
రూ.1.35 లక్షల కోట్ల వ్యయంతో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంత దశ దిశ మార్చబోతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతతో, తక్కువ కాలుష్యంతో ఈ పరిశ్రమ ఏర్పడటం సంతోషకరమని అన్నారు.
గతంలో పాలకులు బెదిరింపులతో పరిశ్రమలను పంపించారని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం కేవలం 18 నెలల్లోనే భారీ పెట్టుబడులకు భూమి పూజ జరగడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఉదాహరణ అని తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తున్నామని, శాంతిభద్రతలను పునరుద్ధరించామని చెప్పారు. 25కు పైగా రంగాల వారీ విధానాలతో వేగంగా అనుమతులు ఇస్తున్నామని వివరించారు. గూగుల్ వంటి సంస్థలు కూడా ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం దీనికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ సిఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.



