కవిత హడావిడేనా
హైదరాబాద్, సెప్టెంబర్ 4, (వాయిస్ టుడే)
Is the poem a rush?
కల్వకుంట్ల కవిత ఇక బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఆమె భవిష్యత్ ప్రణాళిక మాత్రం కొత్త పార్టీ అన్నది మాత్రం అర్థమవుతుంది. బీఆర్ఎస్ నాయకత్వం తనపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నారు. తన తండ్రి చుట్టూ దయ్యాలున్నాయని, తన తండ్రి దేవుడని అన్నప్పటికీ కేసీఆర్ కుమార్తె విషయంలో వెనక్కు తగ్గలేదు. పార్టీ కోసం కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేశారు. అసలే తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయానికి రగిలిపోతున్న కవిత సస్పెన్షన్ తో మరింతగా రగిలిపోతున్నట్లే ఉంది. అందుకే కవిత పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు పార్టీ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా త్యజించి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయినట్లు కనిపిస్తుంది.. కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై యుద్ధం కాకుండా, బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే వార్ ప్రకటించేందుకు సిద్ధమయినట్లు కనపడుతుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు. తన తండ్రి కేసీఆర్ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారని ఆమెకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ విచారణతో చికాకులో ఉన్న పెద్దాయనను కవిత మరింత చికాకు పెట్టినట్లయింది. అయితే కవిత చాలా రోజులుగా పార్టీపైన, నేతలపైన విమర్శలు చేసినా కేసీఆర్ ఓపిక పట్టారు. పెద్దగా పట్టించుకోనట్లు వదిలేశారు. అయితే కాళేశ్వరం విషయంలో కవిత చేసిన కామెంట్స్ ఆయననే ఇబ్బంది పెట్టాయి. కనీసం బంధువులని లేకుండా, పార్టీలో తనకు ముఖ్యులని తెలిసినా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇబ్బంది పడ్డారు. అందుకే ఆయన తన భార్యతోనూ చర్చించారు. కుమార్తె అని చూస్తూ ఊరుకుంటే రానున్న ఎన్నికలకు ముందు మరింత మంది నేతలు రెచ్చిపోయే అవకాశాలు లేకపోలేదు. అందుకే కవితను సస్పెండ్ చేసి ఆమె భవిష్యత్ లో చేసే విమర్శలకు ప్రాధాన్యత లేకుండా ప్రస్తుతానికి అయితే చేయగలిగారు. కవిత ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అయితే ఒకటి మాత్రం నిజం. ఏపీలో వైఎస్ షర్మిలను ఎవరూ పట్టించుకునే వారు లేరు. తొలినాళ్లలో ఉన్న క్రేజ్ రానురాను తగ్గిపోయింది. కవిత విషయంలోనూ అదే జరుగుతుంది. సొంత పార్టీ పెట్టినా కల్వకుంట్ల కవిత చేతులు కాల్చుకోవడం తప్ప మరొక ప్రయోజనం ఉండదన్నది వాస్తవం. మరి కవిత తీసుకునే నిర్ణయం ఆమెకే వదిలేసిన్నా.. రాజకీయంగా ఏదో ఒకరోజు మళ్లీ కారు ఎక్కాల్సిందేనని చెప్పక తప్పదు.
సెంటిమెంట్ జోడిస్తూ..
కవిత మీడియా సమావేశాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనకు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై ఎటువంటి వ్యతిరేకం లేదని చెప్పకనే చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ లు మంచోళ్లేనని, కానీ ఆయన పక్కన ఉండి చెడగొడుతుంది హరీశ్ రావు, సంతోష్ రావులు మాత్రమేనని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీశ్ రావు అరవై లక్ష రూపాయలు సిరిసిల్ల నియోజకవర్గానికి పంపారని తెలిపారు. అలాగే కేసీఆర్ ను ఓడించడానికి కూడా హరీశ్ రావు ప్రయత్నించారని తెలిపారు. అదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి కూడా హరీశ్ రావు కారణమని ఆమె చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి కూడా హరీశ్ రావు కారణమని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎన్ని జన్మల పుణ్మముంటే తనకు కేసీఆర్ లాంటి తండ్రి ఉంటారని కూడా సెంటిమెట్ తో కొట్టారు. హరీశ్ రావు, సంతోష్ రావులు గత కొన్నేళ్ల నుంచి తనపై కుట్రలు చేస్తూ వస్తున్నారని, వాళ్లిద్దరూ రేవంత్ రెడ్డి తో ఏకమై తనను బయటకు పంపేందుకు కూడా కుట్రలు పన్నింది వాళ్లేనని స్పష్టంగా చెప్పారు. వ్యక్తిగత లబ్ది పొందేవాళ్లు తాము ముగ్గురం కలసి ఉండొద్దని భావించి మొదటి అడుగులో తనను పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు. తనకు తొలిసారిగా ఆరడుగుల బుల్లెట్ తాకిందని, తర్వాత రామన్నను, తర్వాత కేసీఆర్ ను కూడా తాకే అవకాశం లేకపోలేదని కవిత తెలిపారు. తాను, కేటీఆర్ లు తెలంగాణ ఉద్యమం సమయంలో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఆయన వెంట నడిచామన్నారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైతే వారు బాగుపడతారని భావించి ఉండవచ్చు అని అన్నారు.కేసీఆర్ కు కూడా కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి చూసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలో భాగంగానే తనపై ఈ నిర్ణయం తీసుకునేలా కేసీఆర్ పై వత్తిడి తెచ్చారన్నారు. కవిత మీడియా సమావేశం చూసిన వారికి ఎవరికైనా.. తండ్రి కేసీఆర్ ను దూరం చేయాలని భావించడం లేదు. అలాగే సోదరుడు కేటీఆర్ కు, తనకు ఏ మాత్రం విభేదాలు లేవని కూడా ఆమె నేరుగానే చెప్పారు. తన కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నానని చెబుతూ పార్టీలో అగ్రనేతలైన కేసీఆర్, కేటీఆర్ లను ఆకట్టుకునే ప్రయత్నం కవిత మీడియా సమావేశంలో కనపడిందని చెప్పాలి. హరీశ్ రావు, సంతోష్ రావు లను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు.



