హైదరాబాద్:అక్టోబర్ 21: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్,హెచ్సీఏ,నూతన అధ్యక్షుడిగా జాతీయ హ్యాండ్బాల్ సంఘం,హెచ్ఏఐ, ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్మోహన్ రావు శుక్రవారం సాయంత్రం ఎన్నికయ్యారు.

అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ప్రత్యర్థి అమర్నాథ్ రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేయడంతో ఉత్కంఠ మొదలైంది.
దీంతో మరోసారి ఓట్లను కౌంట్ చేయడం జరిగింది. రీకౌంటింగ్లోనూ జగన్మోహన్ రావు విజయం సాధించడంతో ఉత్కంఠ ముగిసింది.
వైస్ ప్రెసిడెంట్గా దల్జిత్ సింగ్ గుడ్ గవర్నెన్స్ ప్యానల్, సెక్రటరీగా దేవరాజు క్రికెట్ ఫస్ట్ ప్యానల్ , జాయింట్ సెక్రటరీగా బసవరాజు గుడ్ గవర్నెన్స్ ప్యానల్ ట్రెజరర్గా సీజే శ్రీనివాస్ రావు యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ, కౌన్సిలర్గా సునీల్ అగర్వాల్ క్రికెట్ ఫస్ట్ ప్యానల్ విజయం సాధించారు.
కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ సజావుగా సాగింది. మొత్తం ఓట్ల సంఖ్య 173. పోలైనవి 169. కౌంటింగ్ కూడా సాఫీగా సాగింది.
అనంతరం గెలుపు సంబరాలు కూడా జోరందుకున్నాయి. క్రికెటర్స్ వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలిరాజ్, స్రవంతి సహా పలువురు తమ హెచ్సీఏ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఐపీఎస్ సజ్జనార్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఓటు వేసిన వారిలో ఉన్నారు. మూడు గంటలకు పోలీంగ్ పూర్తయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.
కాగా ప్రెసెడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్.. ఈ ఆరు పదవుల కోసం నాలుగు ప్యానెల్స్ ఎన్నికల బరిలో దిగాయి.
సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ లావు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వీఎన్ సంపత్ ఆధ్వర్యలో హెచ్సీఏ ఎన్నికలు నిర్వహించారు…



