మహబూబ్నగర్లో జనసేన పార్టీ భారీ నామినేషన్ ర్యాలీ
మహబూబ్నగర్:
తెలంగాణ రాష్ట్ర మహబూబ్నగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఎర్ర సత్యం చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, క్లాక్ టవర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది.
జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎలక్షన్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నియమించిన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జ్ బొర్రా వెంకట్ అప్పారావు నాయకత్వంలో ఈ ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడింది. అనంతరం అభ్యర్థులు మహబూబ్నగర్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా వెంకట్ అప్పారావు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారిగా పోటీ చేస్తోందని తెలిపారు. పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజల మద్దతుతో జనసేన అభ్యర్థులు విజయం సాధించి ప్రజాసేవకు అంకితమవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, అవినీతి రహిత పాలన జనసేన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ నాయకులు పి.ఆర్. రాఘవేంద్ర, గోనెల భరద్వాజ్, నల్లమల శివ, మీడియా కోఆర్డినేటర్ కొల్లా శంకర్, నడింపల్లి శ్రీనివాస్తో పాటు జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణమంతా జనసేన నినాదాలతో మార్మోగింది.



