బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ధ్వజం
Kavitha Dhwajam on Bandi Sanjay's comments
హైదరాబాద్
కేంద్రమంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం నాడు సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. బండి సంజయ్ మాటలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని అని కవిత ప్రశ్నించారు.
కిందస్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే కదా అని నిలదీశారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వమనే మాట మాట్లాడుతున్నారంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు అని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదని చెప్పారు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలని అంటున్నారని, కానీ తాను ఆయనను తెలంగాణకు రావాలని స్వాగతిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడాలని కవిత చెప్పారు.
తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరు చెబుతున్న రాజ్యాంగ విలువలు ముందు ఇక్కడ కాపాడాలని కవిత హితవు పలికారు. కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్లో మత కల్లోహాలు జరిగి వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు, ఆసిఫాబాద్లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించ లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కనీసం అటువైపు చూడ లేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతుందని కవిత ఆరోపించారు.



