- Advertisement -
కోనసీమ రైతులకు సిరులు కురిపించిన కుంభమేళ
Kumbhmela showered with money for Konaseema farmers
రాజమండ్రి, ఫిబ్రవరి 4, (వాయిస్ టుడే)
ప్రయాగ్రాజ్లో కుంభమేళా కోట్ల మంది ప్రజలు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడ నదీమాతకు కురిడీ కొబ్బరిని ప్రసాదంగా సమర్పిస్తున్నారు. ఆలయాల వద్ద కూడా కొబ్బరి కాయలు కొడుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయో తెలుసా? కేరళాను తలపించే కోనసీమ ప్రాంతం నుంచే. వందల లారీల సరకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే అత్యధికంగా ఈ కొబ్బరి కాయల సరఫరా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ కుంభమేళా పుణ్యామని కోనసీమలో కురిడీ కొబ్బరి ధర ఒక్కసారిగా పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రతి రోజూ దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి వందల సంఖ్యలో లారీలు ద్వారా కొబ్బరి ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో నదీమతల్లికి కురిడీ కొబ్బరి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. దీంతో ఒక్కసారిగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. చాలా కాలం ఆశించిన స్థాయిలో ధర లేక ఇబ్బందులు పడ్డ కోనసీమ కొబ్బరి రైతులు కుంభమేళా కారణంగా లాభాల్లోకి వెళ్తున్నారు. ఇది ఎంతలా అంటే కొబ్బరి మార్కెట్లో ధర రూ.18 వేలు నుంచి రూ.20 వేలు వరకు పలుకుతుండడంతో గతంలో ఈ స్థాయి ధర ఎప్పుడూ పలకలేదని అంబాజీపేట కొబ్బరి వ్యాపారులు చెబుతున్నారు.కురిడీ కొబ్బరి కేవలం నూనె అవసరాలకోసమే ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 100 నుంచి 300 లారీల వరకు కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు, రైతులకు, వినియోగదారులకు గతంలో కేవలం రూ.7 వేలకు పడిపోయిన కొబ్బరి ధర ఇప్పుడు రూ.18 వేలుకుపైబడి పలుకుతోంది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీనికి కారణం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో కోనసీమ కొబ్బరికి అమాంతంగా డిమాంద్ పెరిగింది. కుంభమేళాతో ఇప్పుడు డిమాండ్ బాగా పెరగడంతో కొబ్బరి రైతుల వద్ద కురిడీ కొబ్బరి కొరత ఉందని రైతులు చెబుతున్నారు..కొబ్బరి తోటల్లో పలు రకాల తెగుళ్లతో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొబ్బరి తోటల సస్యరక్షణ చర్యలకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో కూడా నష్టపోతున్నారు. అయితే ఇప్పుడు కొబ్బరి ధర అమాంతంగా ఎగబాకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ప్రయాగరాజ్లో కుంభమేళాల్లో కోట్ల మంది భక్తులు కొబ్బరిని కొనుగోలు చేయడం ప్రధాన కారణంటున్నారు.
- Advertisement -