క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్
హైదరాబాద్, మే 17 (వాయిస్ టుడే)
ఇకపై సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్? మారనుందా? రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నారా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ప్రస్తుం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సమావేశాలకు ఇబ్బందికరంగా మారడంతో ‘లేక్ వ్యూ’ గెస్ట్ హౌస్ ని వినియోగించాలని యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 2 తర్వాత ఆ భవనాన్ని ఏపీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ గా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసిన జూన్ 2 వ తేదీతో పదేళ్లు పూర్తవుతుంది. ఇప్పటిదాకా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారనుంది. దీంతో ఏపీకి సంబంధించి హైదరాబాద్ లో కొనసాగుతున్న కార్యాలయాలు, గెస్ట్ హౌస్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో కిరాయిలయినా వాటికి ఏపీ సర్కార్ కట్టుకోవాల్సివస్తుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, సమైక్య ఏపీ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత, అవశేష రాష్ట్రం ఏపీ తన ఆధీనంలో ఉన్న భవనాలను, హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్హౌస్ను కూడా ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ఖాళీ చేయడమా..? లేకుండా కిరాయిలు కట్టడమా అనే నిర్ణయం తీసుకొని కార్యాచరణలో పెట్టాలి.అయితే జూన్ 2 గడువు ముగిసే నాటికి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరదు. జూన్ 4వ తేదీన అక్కడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. దీంతో ఏం జరుగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లేక్ వ్యూ అతిథి గృహం, లక్డీకాపూల్ లోని సీఐడీ ఆఫీసు, ఆదర్శ్ నగర్ లోని హెర్మిటేజ్ భవనం ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వీటిని ఖాళీ చేయడానికి మరో ఏడాది పాటు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో తెలంగాణ సర్కారును అభ్యర్థించింది. దీనిని తెలంగాణ సర్కారు తిరస్కరించినట్టు సమాచారం. అయితే అద్దె ప్రాతిపదికన ఏడాది పాటు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తుందని తెలుస్తోంది.లేక్ వ్యూ గెస్ట్ హౌస్ 13 విశాలమైన గదులతో రెండు అంతస్తుల భవనం కలిగివుంది. గెస్ట్ హౌస్ పునరుద్ధరించడానికి, ఫర్నీచర్స్ కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం సుమారు రూ .8 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఏపీ పరిపాలన విజయవాడకు మారిన తరువాత, గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది.2016లో అప్పగి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. పలు విభాగాలను, శాఖల కార్యాలయాలను అక్కడికి మార్చారు. ఏడాది పాటు ఈ తరలింపు ప్రక్రియ కొనసాగింది. 2019లో ఏపీ ప్రభుత్వం కొన్ని భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఈ భవనాలను ఆస్తిపన్ను నుంచి మినహాయించాలని తెలంగాణ సర్కారుకు సూచించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సీఐడీ ఆఫీసు, హెర్మిటేజ్ భవనాలను అవసరాల కోసం ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పారు. అప్పటి ప్రభుత్వం అంగీకరిచింది. ప్రస్తుతం గడువు ముగిసినందున ఈ మూడు భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేస్తుందా..? లేక అద్దె చెల్లిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ విషయంలో క్యాంప్ ఆఫీసుగా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరగుతోంది.
సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్

- Advertisement -
- Advertisement -