బంజారాహిల్స్లో ముదిరిన భూ వివాదం
ఏపీ ఎంపీ vs సామాన్యుడు
హైదరాబాద్, మార్చి 23
Land Dispute Escalates in Banjara Hills
AP MP vs. Common Man
హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రైమ్ ఏరియాల్లో అయితే గజం లక్షల్లోనే పలుకుతోంది. అదే సమయంలో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కబ్జాలు, ఆస్తి వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్లో ఓ స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ వివాదంలో ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ ఉండటం గమనార్హం.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో పాటు తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, మరో వర్గం వారి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2, అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆనంద్ ప్రభాత్ సొసైటీలో ఉన్న స్థలం విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గత మూడేళ్ల కిత్రం వివాదాస్పద స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ స్థలంలో నిర్మాణాలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. కాగా, ఆ స్థలంలో 2 వేల గజాలు తనదేనంటూ శివనారాయణ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. తన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని.. ఇటీవల కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. శివనారాయణ తన మనుషులతో స్థలం వద్దకు చేరుకొని ప్రహరీ రేకులను తొలగించాడు. అక్కడ కంటెయినర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. తాను పెట్టించిన రేకులను ఎలా తొలగిస్తారంటూ హల్చల్ చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో కొట్టుకునే వరకు వెళ్లారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతిపజేశారు. ఆ తర్వాత రెండు వర్గాలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శివనారాయణ తాము వేసిన రేకులను అక్రమంగా తొలగించి స్థలం ఆక్రమణకు పాల్పడ్డారని సీఎం రమేష్ తరఫున సూపర్వైజర్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ప్రతిగా.. తమ స్థలంలో కంటెయినర్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా సీఎం రమేష్, అతని అనుచరులు, బీజేపీ నేత లంకల దీపక్రెడ్డి, కొమురయ్య, లగడపాటి రాజగోపాల్ మనుషులు వచ్చి దౌర్జన్యం చేశారని.. తమపై దాడి చేశారని శివనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2006లో తాను ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు శివనారాయణ మీడియాతో వెల్లడించారు. అప్పటి నుంచి సీఎం రమేష్ తన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇదే విషయమై తాను కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.



