చివరి నిమిషంలో నోట్ల పంపిణీ
హైదరాబాద్ ఫిబ్రవరి 10
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు .. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా ఖరీదుగా మారాయి అనేది అర్థం అవుతోంది. పార్టీలు, అభ్యర్థులు అని తేడా లేకుండా.. డబ్బు, మద్యం, మాంసం, బహుమతులు, బంగారం, వెండిని ఓటర్లకు పంచుతూ.. వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఖరీదైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. ఎలాగైనా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలిచి.. ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో ఓట్లను రాబట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా జరిగే పరిధిలో కౌన్సిలర్ పదవి కోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. అది చూసి ఓటర్లే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.


