మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ దేనికీ పనికిరాదు:
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Madhu Ridge Park Apartments Are Useless:
CM Revanth Reddy Makes Sensational Remarks
గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ భవిష్యత్తులో ఎందుకూ పనికిరాదని, దానిని ఎవరూ కొనబోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ శాసనమండలిలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తాము ఆ అపార్ట్మెంట్ కావాలని అడగలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాళ్లకు సమస్య ఉందని చెబుతున్నా కొందరు వినిపించుకోవడం లేదు. గాంధీ సరోవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 98 ఎకరాల డిఫెన్స్ భూమిని ఇస్తోంది. టూరిజం శాఖ వద్ద మరో 100 ఎకరాల భూమి ఉంది. మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఇబ్బంది లేదు’ అని క్లారిటీ ఇచ్చారు.అయితే, 2005-06లో ఆ అపార్ట్మెంట్కు అనుమతులు పొందినప్పుడు దానిని ఒక చిన్న నాలా కింద చూపించి, కేవలం 9 మీటర్ల బఫర్ జోన్తో పర్మిషన్ తెచ్చుకున్నారని సీఎం గుర్తు చేశారు. కానీ 2012, 2016 నిబంధనల ప్రకారం బఫర్ జోన్ పరిమితి 50 మీటర్లకు చేరడంతో అది ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంగా మారిపోయిందన్నారు. ‘50 మీటర్ల నిబంధన ప్రకారం మార్క్ చేస్తే.. నేడు సగం అపార్ట్మెంట్ బఫర్ జోన్లోనే ఉంది. రేపు భవిష్యత్తులో ఆ ఫ్లాట్లను అమ్ముకోవడానికి లేదా కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వాళ్లకు ఇష్టమైతే, ఆ భూమిని ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం అప్పగిస్తే.. నిబంధనల ప్రకారం నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మాది స్మార్ట్ గవర్నెన్ప్..
రాష్ట్రంలో తమది కేవలం గుడ్ గవర్నెన్స్ కాదని.. ‘స్మార్ట్ గవర్నెన్స్’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ శాసనమండలిలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు మెట్రో నగరాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో వర్షం వచ్చిందంటే జనజీవనం స్తంభించి ఎటూ కదలలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. కానీ హైదరాబాద్ అంటే ‘లేక్స్ అండ్ రాక్ సిటీ’ అని కొనియాడారు. ప్రస్తుతం ‘ఓల్డ్ సిటీ’గా పిలవబడే ప్రాంతమే అసలైన ‘ఒరిజినల్ సిటీ’ అని ఆయన స్పష్టం చేశారు.అద్భుతమైన హైదరాబాద్ నగరంలో మానవ తప్పిదాల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల ఆర్థిక స్తోమత పెరగడంతో వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని అన్నారు. అందుకే గతంలో బేగంపేట నుంచి శంషాబాద్కు విమానాశ్రయాన్ని తరలించామని గుర్తు చేశారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. గతంలో దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ‘క్యూర్, ప్యూర్, రేర్ పాలసీతో ముందుకు వెళ్తోందని చెప్పారు. కాలుష్యకారక పరిశ్రమలను పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని, ఆ భూములను మల్టీ జోన్లుగా వినియోగించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.
కేంద్రం సూచనతోనే మెట్రో స్వాధీనం..
మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ సంస్థ సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. కంటోన్మెంట్ కారణంగా ఉత్తర తెలంగాణ నుంచి నగరానికి వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పంజాగుట్ట, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం వివరించారు.



