అదానీకి మోడీ సర్కార్ అండ…!!!
Modi Sarkar for Adani…!!!
– బంగ్లాదేశ్తో కాంట్రాక్ట్ విద్యుత్ను
– భారత్లో విక్రయించేందుకు అనుమతి
– ఎగుమతులపై మార్గదర్శకాలను సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: బడా వ్యాపారవేత్త అదానీకి మోడీ సర్కారు మరొకసారి అండగా నిలుస్తున్నది. ఇందుకు బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిర పరిస్థితులను సైతం అదానీకి అనుకూలంగా మార్చుతున్నది. బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకున్న విద్యుత్ను భారత్లో విక్రయించటానికి అదానీ పవర్కు మోడీ సర్కారు అనుమతించింది. ఈ మేరకు కేంద్రం విద్యుత్ ఎగుమతులపై మార్గదర్శకాలను సవరించింది. ఈ విషయాన్ని ఒక వార్త సంస్థ నివేదించింది. అయితే, బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కారణంగా ఏర్పడే అంతరాయాల నుంచి అదానీ పవర్ను రక్షించటంలో ఈ చర్య సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.2018లో మోడీ ప్రభుత్వం పొరుగు దేశానికి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేసే జనరేటర్లపై మార్గదర్శకాలను రూపొందించింది.
జార్ఖండ్లోని గొడ్డా జిల్లాలో అదానీ పవర్ 1,600-మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రస్తుతం అది ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్ను మరొక దేశానికి సరఫరా చేయడానికి ఒప్పంద బాధ్యతను కలిగి ఉన్నది. ఈ సందర్భంలో అది బంగ్లాదేశ్కు చేయాల్సి ఉన్నది. అయితే, ఈనెల 12న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన మెమో.. మార్గదర్శకాలను సవరించింది. పూర్తి లేదా పాక్షిక సామర్థ్య స్థిరమైన షెడ్యూల్ లేని సందర్భంలో భారత్లో విద్యుత్ అమ్మకాలను సులభతరం చేయటానికి ప్రభుత్వం అటువంటి ఉత్పాదక స్టేషన్ను భారతీయ గ్రిడ్కు అనుసంధానించటానికి అనుమతించవచ్చని రాయిటర్స్ వివరించింది. చెల్లింపులు ఆలస్యమైతే భారతీయ గ్రిడ్కు విద్యుత్ను విక్రయించటానికి కూడా సవరణ అనుమతిస్తుంది. భారత్లో మొత్తం విద్యుత్ లభ్యతను పెంచటానికి ఈ చర్య సహాయపడుతుందని అదానీ గ్రూప్ తెలిపింది. మొత్తానికీ, బంగ్లాదేశ్కు అదానీ పవర్ విద్యుత్ ఎగుమతులు చాలా కాలంగా వివాదానికి కేంద్రంగా ఉన్నాయి. నిపుణులు దీనిని అధిక ధరలకు ఢాకా కొనుగోలు చేయవలసి ఉంటుందని వాదించారు. బంగ్లాదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు ఈ ఏర్పాటును విమర్శించాయి. ఇది అత్యంత అసమాన ఒప్పందమని అభివర్ణించాయి.
2017లో ఢాకాలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంతకం చేసిన ఒప్పందం ప్రకారం అదానీ గ్రూప్ సంస్థ బంగ్లాదేశ్కు విద్యుత్ను విక్రయిస్తుంది. ప్రధాని మోడీ బంగ్లాదేశ్లో పర్యటించిన కొద్దిసేపటికే 2015 ఆగస్టులో అదానీ గ్రూప్, ఢాకా మధ్య అవగాహన ఒప్పందం కుదరటం గమనార్హం. అదానీ గ్రూప్, బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య జరిగిన డీల్లో మోడీ ప్రమేయం నేరుగా ఉన్నదా అని భారత్లోని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి కూడా. అయితే ఈ ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు గతేడాది కంపెనీకి లేఖ రాసింది. కోరిన సవరణలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, అధిక ధరలు వివాదాస్పదంగా ఉన్నాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు.




