భీమన్నను దర్శించుకున్న మల్టీ జోన్1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
Multi-Zone 1 IGP Chandrasekhar Reddy visits Bheemanna.
వేములవాడ
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి,
శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన ఐజీపీ కి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఈవ ఎల్. రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పోలీసు అధికారులతో మాట్లాడుతూ, దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలయ పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈవో ఎల్. రమాదేవి, వేములవాడ మరియు సిరిసిల్ల డీఎస్పీలు శ్రీనివాస్, నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు తదితరులు పాల్గొన్నారు.



