Tuesday, February 17, 2026

 స్వతంత్ర అభ్యర్ధికి మున్సిపల్ ఛైర్మన్

- Advertisement -

 స్వతంత్ర అభ్యర్ధికి మున్సిపల్ ఛైర్మన్

అదిలాబాద్, ఫిబ్రవరి 16 :వాయిస్ టుడే

Municipal Chairman for independent candidate

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. స్పష్టమైన మెజార్టీ లేక హంగ్ ఫలితాలు వెలువడిన చోట ఎత్తుకు పైఎత్తులు.. అనైతిక పొత్తులతో ప్రధాన పార్టీలు సిగపట్ల రాజకీయాలకు తెరలేపాయి. నేడు సోమవారం జరిగే కీలకమైన బల్దియా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా అభ్యర్థుల మద్దతు కూడగట్టుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నాయి.ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఓట్ల శాతం పెరిగి, అతి పెద్ద పార్టీగా అవతరించి చైర్మన్ పీఠానికి అడుగు దూరంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కంగు తినిపించేలా అనైతిక పొత్తులతో ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతునిస్తున్నాయి. తాజాగా మారిన పరిణామాలు బిజేపి శిబిరంలో ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హంగ్ ఫలితాలు వచ్చిన ఆదిలాబాద్, కాగజ్ నగర్, బైంసా, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చేందుకు పార్టీలు జోరుగా మంతనాలు సాగిస్తున్నాయి. ఆదిలాబాద్ బల్దియా పీఠం కైవసం చేసుకునే ప్రయత్నంలో భాగంగా మధ్యప్రదేశ్ రిసార్ట్ లో 21 మంది కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఊహించని షాక్ తగిలింది. ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీకి చైర్మన్ పీఠం దక్కుతుందని అందరూ ఊహించగా, అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. 11 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఆరు స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ వ్యూహాత్మకగా పావులు కదిపి ఇండిపెండెంట్ అభ్యర్థి (కాంగ్రెస్ రెబల్) బండారి అనూషసతీష్ పేరు ప్రతిపాదించడం గమనార్హం. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు ఎంఐఎం తమ ఆరుగురు కౌన్సిలర్లతో కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడానికి ఓవైసీ అంగీకరించారు. దీంతో 45వ వార్డు నుండి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష-సతీష్ కు చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.వైస్ చైర్మన్ పదవీ తమకు ఇవ్వాలని ఎంఐఎం, మాకే దక్కాలని బీఆర్ఎస్ పట్టు పడుతూ మంతనాలు సాగిస్తున్నాయి. వైస్ చైర్మన్ పదవి ఎంఐఎంకే దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్ లో మొత్తం 49 వార్డులకు గాను బీజేపీకి ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఎక్స్ ఆఫీషియ ఓట్లు కలుపుకొని 23 సీట్లు ఉండగా, గెలుపుకు మ్యాజిక్ ఫిగర్ 26 రావాల్సి ఉంది. ఇద్దరు ఇండిపెండెంట్ లు నిన్నటి వరకు బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పి, కాంగ్రెస్ ఆఫర్ తో వెనుతిరగడం కమలం పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్ లు ఆదివారం రోజే కాంగ్రెస్ శిబిరంలో చేరడంతో కేవలం 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంతో ఇండిపెండెంట్ కు పట్టం కడుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా బీజేపీకి షాక్ ఇచ్చి పంతం నెరవేర్చుకుంటున్నది.తెర వెనుక నుండి ఎన్నికల ఇన్చార్జ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ చక్రం తిప్పడంతో సమీకరణలు ఒక్కసారి రూపుమారాయి. కాగా ఒకవేళ బిఆర్ఎస్ మద్దతు ఇస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని కాషాయ దళం నేతలు ఆఫర్ ఇచ్చారు. అయినా బిఆర్ఎస్ తోసి పుచ్చింది. కాగా బిజెపి తరపున మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి జోగు శైలజ పేరు చైర్మన్ గా ప్రతిపాదించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అనైతిక పొత్తులు తెరలేచాయి. మొత్తం 12 స్థానాల్లో బీజేపీ బిఆర్ఎస్ కు చెరిసగం నాలుగు సీట్లు, కాంగ్రెస్ కు 3, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరడంతో మూడు పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయి. ఇక్కడ చైర్మన్ పదవి బీజేపీకి దక్కాలని పట్టుబడుతుండగా, బీఆర్ఎస్ తమకే ఇవ్వాలని వైస్ చైర్మన్ పదవి ఇస్తామని మంతనాలు సాగిస్తున్నాయి. నేడు జరిగే ప్రమాణ స్వీకారంలో ఎవరికి చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉందనేది వేచి చూడాలి.కాగజ్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. 12 సీట్లు గెలిచిన బీఆర్ఎస్, ముగ్గురు ఇండిపెండెంట్లను శిబిరంలోకి చేర్చుకుంది. అయితే మరో ఇండిపెండెంట్ మద్దతుతో ఏ పార్టీల ప్రమేయం లేకుండా చైర్మన్ పీఠం దక్కించుకునేందు కు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యూహం రూపొందించారు. ఆసిఫాబాద్ లో హంగ్ నేపథ్యంలో వైస్ చైర్మన్ ఇండిపెండెంట్ లకు ఇచ్చేందుకు కోనప్ప అంగీకరించారు. బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం 12 స్థానాల్లో గెలవగా, ఆరుగురు బీజేపీ అభ్యర్థులు, 7గురు స్వతంత్రులు చైర్మన్ పీఠం కోసం మంతనాలు సాగిస్తున్నారు. అడుగు దూరంలో ఉన్న ఎంఐఎం ఒక్క సీటు కోసం పడరాన్ని పాట్లు పడుతోంది. నేడు సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠత రేపుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్