మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ అక్టోబర్ 03(వాయిస్ టుడే) కరీంనగర్ లోని రోడ్లన్ని సీసీ బీటిలతో తళతళలాడన్నదే తన ధ్యేయమని, నగరంలో గుంతలు లేని రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగాలన్నదే తన అభిమతమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని 3వ డివిజన్ కిసాన్ నగర్ లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. సీఎం హామీ నిధులు 133 కోట్లలో భాగంగా డివిజన్ లో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రయినేజీ పనులను ప్రారంభించారు. అనంతరం స్థానిక నాకా చౌరస్తా లో బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమైక్య పాలనలో అప్పటి పాలకులు కరీంనగర్ అభివృద్ది కోసం నిధులు తీసుకురాకపోవడంతో ఇక్కడ అభివృద్ది కుంటుపడిందని, దీంతో నగరంలోని రోడ్లన్ని గుంతలమయమై డ్రయినేజీలు దుర్ఘందాన్ని వెదజల్లేవన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో వందలాది కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి కరీంనగర్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే నగరంలో 240 కిలోమీటర్ల సీసీ బీటి రోడ్లను నిర్మించామని, మరో 147 కిలోమీటర్ల రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 133 కోట్ల సీఎం హామి నిధులతో నగరంలోని ఏ డివిజన్ లో చూసిన అభివృద్ది పనులు జరుగుతూ కనిపిస్తున్నాయని, మరో నెల రోజుల్లో ఈ పనులన్నింటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకే నగరంలోని ప్రధాన అంతర్గత రోడ్లను బీటి సీసీ లతో నిర్మిస్తున్నామన్నారు. సుమారు ఎనిమిదిన్నర కోట్లతో 8 కిలోమీటర్ల బీటి రోడ్డు పనులను మరమ్మత్తు చేయనున్నామని తెలిపారు.

ఎన్నికల వేళ..మేము పోటీ చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీల నుంచి పుస్తెలు కాజేసే వారు..భూములను కబ్జా చేసేవారు..30 కి పైగా జైలు కేసులున్న వారు ముందుకు వస్తున్నారన్నారు. అలాంటి వారిని నమ్మితే మన బతుకును అధోగతి పాలు చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల వేళలో తప్ప ఇతర సమయంలో కనిపించరని, వారిది అధికార యావేతప్ప..ప్రజాసేవపై శ్రద్ద లేదన్నారు. అలాంటి నాయకులను నమ్మి అధికారం కట్టబెడితే వారు మన సంపదను దోచుకుని తెలంగాణను మళ్ళీ గుడ్డిదీపం చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి వల్ల కరీంనగర్ అభివృద్ది చెందింది, ఇంకా అభివృద్ది చెందుతుందో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడే నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి గంగుల ఆవిష్కరించారు. బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణను సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ లో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆ మహానీయుని గౌరవించుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. గత పాలకులు కిసాన్ నగర్ ను చిన్న చూపు చూశారని, కిసాన్ నగర్ లో ఏరోడ్డు చూసినా గుంతల మయంగా తాగునీటికి ఇబ్బందులు పడ్డ రోజులు ఉండేవన్నారు. అభివృద్దిలో వెనుకబడ్డ కిసాన్ నగర్ లో రోడ్లు నిర్మించాలని మనస్సు కాంగ్రెస్, బీజేపీ లకు రాలేదన్నారు. కానీ స్వయం పాలనలో కిసాన్ నగర్ రూపురేఖలు మార్చామని, టవర్ సర్కిల్ నుంచి కిసాన్ నగర్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు సుందరమైన రోడ్డును నిర్మించామన్నారు. ఎక్కడైనా రోడ్లు కావాలని అడిగిత 3 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



