-

nellore-barashahid-dargah-festival-of-bread రొట్టెల పండుగకు సర్వం సిద్ధం
- సర్వాంగ సుందరంగా ముస్తాబైన బారాషహీద్ దర్గా
- అన్ని ఏర్పాట్లు పూర్తి
- భక్తుల రాకతో మొదలైన సందడి
- నేటి నుంచి ఆగస్టు 2 వరకు రొట్టెల పండుగ
నెల్లూరు, జూలై : ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రొట్టెల పండుగకు నెల్లూరు బారాషహీద్ దర్గా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతుంది. పలు దుకాణాల ఏర్పాటుతోపాటు భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. సరికొత్త రంగులతో దర్గా కట్టడాలు నూతన శోభను సంతరించుకున్నాయి. అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద బారికేడ్లతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో జల్లు స్థానాలను కూడా షవర్ ల ద్వారా ఏర్పాటు చేశారు. రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రవేశ మార్గాలను, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లకు ఇబ్బందులు పడకుండా శాశ్వతంగా ఉన్న మరుగుదొడ్లతోపాటు తాత్కాలికంగా పలు ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వర్షం వస్తే భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. భక్తులందరికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు దర్గా ప్రాంతాల్లో మంచినీటి కొళాయిలను నిర్మించారు. విద్యుత్ సౌకర్యం ఇబ్బంది లేకుండా జనరేటర్ లను అందుబాటులో ఉంచారు.

ప్రమాదాలు జరగకుండా స్వర్ణాల ఘాట్లో గజ ఈతగాళ్లను, బోట్లను సిద్ధం చేశారు. అగ్నిమాపక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోటు షికారు ఏర్పాటు చేశారు. పోలీస్ అవుట్ పోస్టు, కంట్రోల్ రూమ్, రిసెప్షన్, మానిటరింగ్ సెంటర్, హెల్ప్ డెస్క్ మొదలైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సెప్టిక్ ట్యాంకు వాహనాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఆగస్టు రెండు వరకు జరిగే పండుగకు దేశం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు చర్యలను జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్, ఎస్పీ శ్రీ తిరుమలేశ్వర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ వికాస్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.



