కొత్త సీఎస్ జయేష్ రంజన్..?
హైదరాబాద్, ఫిబ్రవరి 12, (వాయిస్ టుడే)
New CS Jayesh Ranjan..?
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆయన 2025 ఆగస్టు 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడు నెలల పాటు అంటే ఈ ఏడాది మార్చి 31 వరకూ పొడిగించారు. అందుకే మరోసారి ఆయనకు పొడిగింపు వచ్చే అవకాశం లేదని
భావిస్తున్నారు. ఆయన పదవీ విరమణ దగ్గర పడుతుండటంతోనే, ఇప్పుడు కొత్త సీఎస్ ఎంపికపై చర్చ మొదలైంది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పేరు
ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే, 1992 బ్యాచ్కు చెందిన ఆయన ఈ అత్యున్నత పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంపై
పూర్తి పట్టు ఉండటంతో పాటు, గత దశాబ్ద కాలంగా కీలక శాఖల్లో ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ దిశగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం జయేష్ రంజన్ మెట్రోపాలిటన్
ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని పట్టణ పాలనతో పాటు.. యువజన పురోగతి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, క్రీడల శాఖ , పురావస్తు శాఖ
డైరెక్టర్గా అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా యువ సివిల్ సర్వెంట్లకు మార్గనిర్దేశం చేసే నేషనల్ పూల్ ఆఫ్ ట్రైనర్స్ ఇన్ లీడర్షిప్లో ఆయన సభ్యులుగా
కొనసాగుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల సారథిగా జయేష్ రంజన్ చెరగని ముద్ర వేశారు. దాదాపు పదేళ్ల పాటు ఈ శాఖలను పర్యవేక్షించిన ఆయన, రాష్ట్రానికి భారీ
పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా భారత్లోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన ‘టీ-హబ్’ ఏర్పాటు, వినూత్నమైన ఐటీ , పారిశ్రామిక విధానాల రూపకల్పనలో ఆయన కృషి
మరువలేనిది. విదేశీ పర్యటనల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను తెలంగాణ వైపు ఆకర్షించడంలో ఆయన ప్రత్యేకత చూపిస్తారు. జయేష్ రంజన్ 1992 ఐఏఎస్ బ్యాచ్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు. ఐఐఎం కలకత్తా ,
సింగపూర్లోని లీ క్వాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి విద్యనభ్యసించిన ఆయన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టగా పేరు పొందారు. గత ఏడాది కాలంగా వివిధ
పాలనాపరమైన మార్పుల్లో భాగంగా డిసెంబర్ 2025లో ఆయన పరిశ్రమల శాఖ నుంచి పట్టణాభివృద్ధి శాఖకు బదిలీ అయ్యారు.రాష్ట్ర బ్యూరోక్రసీలో అగ్రస్థానంలో మార్పులు జరగనున్న తరుణంలో, జయేష్ రంజన్
అనుభవం , ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఆయనకున్న అవగాహన సీఎస్ పదవికి ఆయనను ముందు వరుసలో నిలబెడుతున్నాయి. అధికార వర్గాల్లో ఉన్న క్లీన్ ఇమేజ్, పాలనాపరమైన కొనసాగింపు దక్కుతుందన్న
నమ్మకం అధికార వర్గాల్లో ఉంది. ప్రభుత్వం త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
జయేష్ రంజన్ కంటే సీనియర్లు శశాంక్ గోయల్ , అరవింద్ కుమార్ ఉన్నారు. అరవింద్ కుమార్ పై ఫార్ములా ఈ రేసు కేసు ఉంది. దాంతో ఆయన పేరు పరిశీలనలోకి తీసుకునే అవకాశం లేదు. మరో సీనియర్
అధికారి వికాస్ రాజ్ కూడా రేసులో ఉన్నారు. అయితే ప్రభుత్వ పెద్దలకు అన్నీ తానై వ్యవహిరంచే జయేష్ రంజన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు


