- Advertisement -
అధికారులకు సంబంధం లేదు..పూర్తి బాధ్యత నాదే:కేటీఆర్..
Nothing to do with officials..Full responsibility is mine: KTR..
హైదరాబాద్
హైదరాబాద్ ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణమైనా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే కేటీఆర్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ అరెస్ట్ పై రాజకీయవర్గాల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎలాంటి విచారణ కైనా సిద్దమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే ఈ కారు రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ అన్నారు.
అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు. కొన్నాళ్ళు జైలులో ఉంటే ఏమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. జైల్లో యోగా చేసుకుని ఫిట్గా అయివస్తానని కేటీఆర్ గతంలో అన్నారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునందుకే కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంకోవైపు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే. రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజల్లోకి తీసుకువెళతామని కారు పార్టీ నేతలు పేర్కొన్నారు.
కాగా ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారం పూర్తిస్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది.. ఈ మేరకు క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 4.10 గంటల నుంచి 8 గంటల వరకూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇందులో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని మంత్రులకు తెలిపారు. అనంతరం ఈ అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నారు.
చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని మంత్రులంతా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కేటీఆర్ పై విచారణకు సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, ఈ విషయంలో జాప్యం జరిగితే ఉపయోగం ఉండదని మెజార్టీ మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాంతో, ఫార్ములా వన్ ఈ-కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతిస్తూ గవర్నర్ పంపిన పత్రాలను సోమవారం రాత్రే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీకి పంపనున్నారు. ఆ తర్వాత చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందని మంత్రులకు సీఎం వివరించినట్లు సమాచారం. కాగా, ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులివ్వనున్నారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ-కారు రేసు పేరిట రెండు మూడు విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్లాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయో ఏసీబీ విచారణలో తేలుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది. అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశం కూడా విచారణలో తేలుతుందని క్యాబినెట్లో చర్చ జరిగింది.
- Advertisement -