అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్
NTR has earned a memorable place in the hearts of his fans-ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అభిమానులు
మంథని
భౌతికంగా ఎన్టీఆర్ దూరమైనా ప్రజలు, అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ని నందమూరి తారక రామారావు అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
శనివారం మంథని పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నందమూరి తారక రామారావు అభిమాన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మెండే రాజయ్య, అభిమాన సంఘం నాయకులు మంథని లక్ష్మణ్, ఆకుల రాజబాబు, మేదరవేన ఓదెలు లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెండే రాజయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు,రావణుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడని అన్నారు. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వబౌముడు నందమూరి తారక రామారావు డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ అని తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించి చిత్ర సీమలో నెంబర్ వన్ గా నిలిపిన అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని తలిచిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.




