ఏజన్సీ లో క్షుద్ర పూజల కలకలం
భద్రాద్రి కొత్తగూడెం
Occult worship in the agency
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం ఏజన్సీ గ్రామంలో క్షుద్రపూజల కలకలం తో గ్రామస్తులు భయాందోళనలో వున్నారు. గ్రామంలో ఓ పామాయిల్ తోట పక్కన పెద్ద గోతిలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో గ్రామస్తులు ఒంటరిగా బయటకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఏజన్సీ ప్రాంతంలో మూఢనమ్మకాలతో ఇలాంటి పూజలు జరుగుతూనే ఉండటం సహజమే కానీ ఈ సారి భూ తగాధాల నేపథ్యంలో ప్రత్యర్థుల కోసమే ఈ క్షద్రపూజలు చేసారన్న వార్త ఊరంతా గుప్పుమనడంతో మూడొందల మంది ఉన్న గ్రామం వణికిపోతోంది. రాత్రిపూట అత్యవసర సమయాల్లో కూడా బయటికి రావడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇదంతా మూఢనమ్మకం అంటూ గ్రామంలో చదువుకున్న యువత ఎంత చెప్పినా కూడా గ్రామస్తులు పెడచెవిన పెడుతున్నారు.దీనిపై యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టి ఇటువంటి మూఢనమ్మకాల పూజలు చేసే వారిపై చర్యలు తీసుకుని, మూఢనమ్మకాలపై అపోహలు పోయేలా కళాజాత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని గ్రామంలోని యువత కోరుకుంటున్నారు.



