
Cat’s eye
పాఠశాల ప్రాంగణం పరాయి వ్యక్తి ప్రయోజనార్థం కేటాయింపు
పాఠశాల ప్రాంగణంలో నుండి
రోడ్డు కోసం భూమి చదును
ఓ పార్టీ నాయకుల ప్రోద్బలంతో
రోడ్డు వేసే సాహసం చేసిన
భూమి యజమాని
భూమి చదును చేసింది ప్రహరీగోడ నిర్మాణానికని అంటున్న గ్రామ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్లు
కబ్జాయత్నం వాస్తవమేనని
స్పష్టం చేసిన ఎంపిటిసి సభ్యుడు
అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
తన దృష్టికి రాలేదంటున్న
తహసిల్దార్
వాయిస్ టుడే మహబూబ్ నగర్ జిల్లా
,నవాబుపేట, మండల పరిధిలోని యన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం కబ్జాకు గురవుతున్నట్లుగా సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాల ప్రహరీ సరిహద్దు ఆక్రమణకు గురవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. పాఠశాల వెనుక భాగంలో వ్యవసాయ పొలం కలిగి ఉన్న భూమి యజమాని తన వ్యవసాయ పొలం విలువ పెంపొందించుకునేందుకు గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకులతో కుమ్మక్కై పాఠశాల సరిహద్దును చదును చేసి రోడ్డు మార్గం చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. గతంలో ఆ భూమి యజమాని అదే ప్రాంతంలో రోడ్డు వేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఆయన తాత్కాలికంగా ఆ ప్రయత్నాలను విరమించుకొని మళ్లీ ఇప్పుడు తన ప్రయత్నాలను ఆచరణ రూపంలో పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు వేసుకునేందుకు తనకు సహకరిస్తే తన సహకారం అందిస్తానని ఆయన గ్రామానికి చెందిన ఓ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులకు ఆశ చూపి తన పని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో ” తలా పాపం తిలా కొంచెం ” అన్న చందంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల ప్రాంగణం సరిహద్దులో నుండి
తన భూమిలోకి వెళ్లేందుకు రోడ్డు వేసుకునేందుకు ఆ భూమి యజమాని గ్రామానికి చెందిన కొందరు ప్రముఖులను, పాఠశాలకు చెందిన కొందరిని ప్రలోభాలకు, వత్తిడులకు గురి చేసి గుట్టు చప్పుడు కాకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయమై గ్రామ సర్పంచ్ జయమ్మ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ హనుమంత్ నాయక్, ల వివరణలు కోరగా పాఠశాల ప్రాంగణం సరిహద్దు ఆక్రమణ
అనేది శుద్ధ అబద్ధమని,పాఠశాల ప్రహరీ గోడ నిర్మించేందుకే ఆ ప్రాంతాన్ని చదును చేయించడం జరుగుతుందని అన్నారు. పాఠశాల ప్రాంగణాన్ని ఇతరుల ప్రయోజనం కోసం వదిలే ప్రసక్తే లేదని ప్రాంగణాన్ని పూర్తిగా పాఠశాలకే దక్కేలా సంరక్షిస్తామని వారన్నారు. కాగా గ్రామ ఎంపీటీసీ సభ్యుడు నీరేటి రామచంద్రయ్య మాత్రం పాఠశాల ప్రాంగణం కబ్జాకు గురవుతున్న మాట పూర్తి వాస్తవమని, రోడ్డు వేయడానికి సహకరిస్తే తన వాటా తనకు ముట్ట చెబుతామని కొందరు తనను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించారని గమనించిన గ్రామస్తులకు తెలిపారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లోనయ్యే ప్రసక్తే లేదని, పాఠశాల ప్రాంగణాన్ని పరుల పాలు కాకుండా సంరక్షించేందుకు తన వంతు ప్రయత్నంగా మండల తహసిల్దార్ కు, డిఈఓ కు మంగళవారం ఫిర్యాదులు చేస్తానని తెలిపారు.ఈ విషయమై మండల తహసిల్దార్ మల్లికార్జున రావును వివరణ కోరగా పాఠశాల ప్రాంగణం సరిహద్దు అక్రమణకు సంబంధించి తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒకవేళ తనకు ఎవరైనా అందుకు సంబంధించి ఫిర్యాదు చేస్తే అలాంటి ప్రయత్నాలను నిలువరించేందుకు ప్రయత్నిస్తానని, అందుకు సంబంధించిన ఎవరైనా పాల్పడినట్లు రుజువైతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.



