ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీల్లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం ఉదయమే సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి.
ఇంట్రాడేలోనూ బుల్ ఆ పరుగును కొనసాగిస్తోంది. సెన్సెక్స్ 75,000 కీలక మైలురాయిని అందుకుంది. నిఫ్టీ 22,768 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణిస్తుండడం విశేషం.
ఉదయం 22,765 వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) ఆరంభంలో కాస్త నెమ్మదించింది. ఐటీ, స్థిరాస్తి రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పుంజుకొని సరికొత్త శిఖరాలను చేరింది. సెన్సెక్స్ సైతం తొలిసారి 75,000 మైలురాయిని తాకి 75,124 వరకు ర్యాలీ అయ్యింది. మార్చి 6న 74,000 మార్క్ను తాకిన ఈ సూచీ కేవలం 24 సెషన్లలోనే మరో 1000 పాయింట్లు పెరగడం విశేషం. 70,000 నుంచి 75,000కు చేరడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ చరిత్రలోనే తొలిసారిగా సోమవారం రూ.400 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. ఉదయం 11:27 గంటల సమయంలో సెన్సెక్స్ 298 పాయింట్ల లాభంతో 75,041 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 22,740 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్-30 సూచీలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి కీలక రాణిస్తుండడం సూచీల్లో ఉత్సాహం నింపింది. రిలయన్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటన్, ఏషియన్ పెయింట్స్, మారుతీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.



