: స్ట్రాటజీస్ ఫర్ సస్టెయినబుల్ సిటీస్ త్రూ జియోస్పేషియల్ టెక్నాలజీస్’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు
సికింద్రాబాద్, మార్చి 05(వాయిస్ టుడే ప్రతినిధి):
వాతావరణ మార్పులపై లోతైన పరిశోధనలు జరిగాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. వాతావరణ మార్పులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. దాంతో గ్రామీణ ప్రాంతాలు సైతం ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. దీనిని అధిగమించేందుకు పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ విభాగంలో ‘ఆర్బనైజేషన్ అండ్ క్లైమేట్ చేంజ్: స్ట్రాటజీస్ ఫర్ సస్టెయినబుల్ సిటీస్ త్రూ జియోస్పేషియల్ టెక్నాలజీస్’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ద దక్కన్ జాగ్రఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (డీజీఎస్ఐ) 18వ అంతర్జాతీయ సదస్సుగా వ్యవహరించే ఈ సదస్సు ప్రారంభోత్సవాన్ని పీజీ ఆర్ ఆర్ సీడీఈ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ పట్టణీకరణతో ఉపాధి కల్పన, అభివృద్ధి, సాంకేతికత తదితర సానుకూల అంశాలు ఉండి, ఆర్థిక అభివృద్ధికి దోహదమవుతోందని చెప్పారు. కానీ దాని వలన వాతావరణ మార్పులు జరిగి దుష్ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. దీనిపై ప్రతి యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో లోతైన పరిశోధనలు జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం అందించాల్సిన బాధ్యత పరిశోధనా సంస్థలపైనే ఉందని అన్నారు. కీలకమైన ఈ అంశంపై సదస్సు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మరో ముఖ్య అతిధిగా హాజరైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎస్ఆర్ఎస్సీ) డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ చౌహాన్ మాట్లాడుతూ జియోస్పేషియల్ సాంకేతికతను వినియోగించుకుని సుస్థిర నగరాలను నిర్మించేందుకు తగిన వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఓయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సదస్సు కన్వీనర్, జాగ్రఫీ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఆశోక్ కుమార్ లోనావత్ మాట్లాడుతూ సదస్సు లక్ష్యాలను వివరించారు. పట్టణీకరణ, వాతావరణ మార్పుల కారణంగా భూగోళంపై ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. దీనిపై చర్చించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, డీజీఎస్ఐ అధ్యక్షుడు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ వీసీ ప్రొఫెసర్ కేఎన్ సింగ్, ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, డీజీఎస్ఐ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ బీసీ వైద్య, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఆశోక్ కుమార్ లోనావత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ మహ్మద్ ఆక్తర్ అలీ, ప్రొఫెసర్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.