*ఎన్.వి.రమణను చైర్మన్ చేసేందుకు మార్గం సుగుమం*
Paving the way for NV Ramana to become the Chairman
తిరుమలలో లడ్డూపై ప్రపంచవ్యాప్తంగా వివాదం నెలకొంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. పవిత్రమైన లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి గత కొంత కాలంగా ఖాళీగా ఉంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీటీడీపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన, ప్రతిష్ఠాత్మక పదవి కావడం వల్ల ఛైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలుత ఈ పదవికి నాగబాబును అనుకున్నారు. నాగబాబు పేరును పవన్కల్యాణ్ రిఫర్ చేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలు నిజంకావని తేలడంతో నాగబాబు పేరు పక్కకిపోయింది. ఇక మరోపేరు టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడు తెరపైకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి టీవీ5 కృషి చేసిన నేపథ్యంలో రిటర్న్గిఫ్ట్గా బీఆర్నాయుడుకు ఆ పదవి ఇస్తారని భావించారు. కానీ తాజాగా మారోపేరు ప్రచారంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ ఎన్.వి.రమణను నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలకమైన ఈ పోస్టుకు ఎన్.వి.రమణ పేరును ఖరారు చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్.వి.రమణ, బి.ఆర్.నాయుడు పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరిని టీటీడీ చైర్మన్గాచే చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రాధాన్యత మాత్రం ఎన్.వి.రమణకే ఉన్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఎన్.వి.రమణను నియమించి టీటీడీని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట.



