నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించిన పవన్ కళ్యాణ్
అమర జవాన్లకు ఘన నివాళి.. తెలుగు వీర సైనికుల స్మారక ఫలకాల వద్ద అంజలి
Pawan Kalyan visits the National War Memorial.

న్యూఢిల్లీ, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించి దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
అమర స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ వందనం చేశారు. కల్నల్ ఆర్.కె. ఆనంద్, కెప్టెన్ రోహిత్ గార్గ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల జీవితాలు, వారి సేవల గురించి సైనికాధికారులు వివరించగా పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం వార్ మెమోరియల్లోని త్యాగచక్ర వద్ద అమర జవాన్ల పేర్లతో చెక్కిన గ్రానైట్ ఫలకాలను సందర్శించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర సైనికుడు జి.ఎన్.ఆర్. సతీష్ సహా పలువురు అమరవీరుల పేర్లు చెక్కిన ఫలకాల వద్ద నివాళులు అర్పించారు. అలాగే శౌర్య చక్ర అవార్డు గ్రహీత రాజ్ కుమార్, హవల్దార్ అరుణ్ కుమార్ స్మారక ఫలకాల వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు.
వార్ మెమోరియల్ సందర్శన అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్లో సంతకం చేసిన పవన్ కళ్యాణ్, అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు స్మారక చక్రాల విశేషాలను సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది సందర్శకులు నిత్యం వార్ మెమోరియల్కు వచ్చి అమరవీరుల పేర్లు చెక్కిన ఫలకాలకు నివాళులు అర్పిస్తారని, దీనిని ఒక పవిత్ర స్థలంగా భావిస్తారని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేష్, శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, వారి సేవలను ఎప్పటికీ మరువలేమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.




