- Advertisement -
తెలంగాణలో పీడీఎస్ రేషన్ బియ్యం దందా..
PDS ration rice danda in Telangana..
బడా నేతల కనుసన్నలోనే తరలింపు!
నల్గోండ, డిసెంబర్ 16, (వాయిస్ టుడే)
తెలంగాణాలోనూ పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా సంచలనం రేపుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంగా గత ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున ఏపీలోని కాకినాడ పోర్టుకు తరలించినట్లు సమాచారం. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే భారీగా రేషన్ బియ్యం దందా జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 10 ఏండ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం దందా వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ రేషన్ బియ్యం దందా జరిగినట్లు సమాచారం. జిల్లాలో కేవలం నలుగురే వ్యక్తులు ఈ దందాను నడిపినట్లు జోరుగా ప్రచారం నడిచింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న లీడర్ల అండండలతో ఈ నలుగురు వ్యక్తులు పదేళ్ల పాటు దందాలో చక్రం తిప్పి కోట్ల రూపాలయ పీడీఎస్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి మల్లించినట్లు సమాచారం.
అయితే ఈ రేషన్ బియ్యం దందా ‘పుష్ప’ సినిమా మాదిరి నడిచినట్లు తెలుస్తోంది. ఒక్కడిగా మొదలైన బియ్యం దందా ఏకంగా పదేళ్లలో జిల్లానే శాసించే స్థాయికి చేరుకుంది. సూర్యపేటకు చెందిన శంకర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో బియ్యం వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించాడు. అయితే పదేళ్లలో అతడి వ్యాపారం బాగా వృద్ధి చెందినట్లు సమాచారం. ఎంతలా అంటే ఉమ్మడి జిల్లాను శాసించే స్థాయికి చేరుకుందని తెలిసింది. అప్పట్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల ఆవిర్భావం జరిగిన విషయం తెలిసిందే. దాని అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు లీడర్ల అండదండలతో అతడు మరింత చెలరేగినట్లు.. ఇక అతడికి తోడు మరో ముగ్గురు చేతులు కలిపినట్లు తెలిసింది. రమేశ్, శివకుమార్, భిక్షపతి అనే ముగ్గురితో కలిసి సిండికేట్గా ఏర్పడినట్లు సమాచారం. దీంతో వీరు డీలర్ల నుంచి రేషన్ బియ్యం సేకరించి ఆ బియ్యన్ని ఏపీలోని కాకినాడ పోర్టుకు మళ్లించి కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పటి అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉండటంతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు వ్యక్తులు ఇంత చేసినా.. బీఆర్ఎస్ హయంలో వీరిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది. ఈ రేషన్ బియ్యం దందాలో ఎవరెవరు ఉన్నారో ఆరో తీస్తోన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవలే కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని విచారించగా.. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలిసినట్లు సమాచారం. దీంతో వెంటనే పోలీసులు శంకర్, భిక్షపతి, రమేశ్, శివకుమార్ను బుధవారం అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ హయాంలో పీడీఎస్ బియ్యం దందాలో పోలీసుల పాత్రపైనా విచారిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పీడీఎస్ రేషన్ బియ్యం దందాలో పోలీసుల నుంచి ఎలాంటి సహకారాలు అందాయి అనే విషయంపై కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నల్గొండ ఎస్పీ నేతృత్వంలో పోలీసులతో ఓ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చూస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొందరి పేర్లు బయటకు వచ్చాయని.. వారి కాల్ డేటాను సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -