ఆపరేషన్ సింధూర్
రాష్ట్రపతికి వివరించిన ప్రధాని
న్యూఢిల్లీ, మే 7. (వాయిస్ టుడే)
PM briefs President on Operation Sindhur
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్.. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో 30మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు 100 మంది మరణించినట్లు సమాచారం.. పాకిస్తాన్లో 4, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో 5.. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. మిస్సైళ్ల వర్షం కురిపించి.. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ అనంతరం తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించారు. అంతేకాకుండా.. ప్రస్తుత పరిస్థితులు.. మాక్ డ్రిల్ తదితర అంశాల గురించి చర్చించారు.పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత.. రాష్ట్రపతి ముర్ముతో భేటీకి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. క్యాబినెట్ వర్గాల సమాచారం ప్రకారం, సమావేశంలో మోదీ తన క్యాబినెట్ సహచరులకు పాకిస్తాన్పై ప్రారంభించిన ఆపరేషన్ గురించి వివరించారు.భారత సైన్యం ఎటువంటి పొరపాటు లేకుండా, సన్నద్ధత ప్రకారం చర్య చేపట్టిందని కూడా ప్రధాని అన్నారు. ఇది గర్వకారణమైన క్షణం.. అంటూ ప్రధానమంత్రి సైన్యాన్ని ప్రశంసించారు. దీని తరువాత, కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. దేశం మొత్తం ఆయనతో ఉందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి రాజ్నాథ్ సింగ్ కేబినెట్ సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. మంత్రివర్గ సభ్యులందరూ టేబుల్ చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు.
ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం..
ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు.



