సీఎం కేసీఆర్ కు సమర్పించిన సర్వేలో వెల్లడి
గోషామహల్ లో మారుతున్న రాజకీయ సమీకరణలు.

గోషామహల్ నియోజకవర్గం లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం సుమారు డజనుకు పైగా బిఆర్ఎస్ నేతలు పోటీ పడుతుండటంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో సీఎం కేసీఆర్ గోషామహల్ తో సహా మరో మూడు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను పెండింగ్లో పెట్టి ఎవరికి ఇస్తే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయనే విషయమై సీఎం కేసీఆర్ తాజాగా సర్వేకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గోషామహల్ లో సర్వే నిర్వహించిన ప్రైవేట్ సంస్థ నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించింది. ఈ సర్వే నివేదిక అందించిన తాజా సమాచారంతో సీఎం కేసీఆర్ గోషామహల్ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని ఈనెల రెండవ తేదీన ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం. సర్వే నివేదిక సమాచారం ప్రకారం పార్టీ టికెట్ను ఆశిస్తున్న డజనుకు పైగా నేతల పేర్లను వడపోసిన తర్వాత నందకిషోర్ వ్యాస్ తోపాటు అనూహ్యంగా ఆర్వి మహేందర్ కుమార్ పేరు తెరపైకి రావడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది.

సర్వే నివేదికలో నందకిషోర్ వ్యాస్, ప్రేమ్ సింగ్ రాథోడ్ , గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్ ల పేర్లలో ఒకరిని ఎంపిక చేయాలని చేసిన సర్వేలో అనూహ్యంగా తెలుగు మాట్లాడే వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు వెళ్లడైంది. దీంతోపాటు తెలుగు భాష మాట్లాడే వారిలో ఆర్వి మహేందర్ కుమార్ తో పాటు గడ్డం అసిష్ కుమార్ యాదవులలో ఒకరికి పార్టీ టికెట్ కేటాయించాలని కోరినట్లు సర్వే నివేదిక లో పేర్కొన్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయం నుండి విశ్వసనీయ సమాచారం అందింది. తాజా రాజకీయ సమీకరణల్లో హిందీ భాష మాట్లాడే వారి నుండి నందకిషోర్ వ్యాస్ ముందు వరుసలో ఉండగా, తెలుగు భాష మాట్లాడే వారి నుండి ఆర్వి మహేందర్ కుమార్ ముందున్నారు. ప్రేమ్ సింగ్ రాథోడ్, గడ్డం ఆశీస్సు యాదవుల పేర్లు కూడా తర్వాతి క్రమంలో ఉన్నాయి. కాగా హిందీ, తెలుగు భాషల్లో నుండి ముందు వరసలో ఉన్న నందకిషోర్ వ్యాస్ ఆర్ వి మహేందర్ కుమార్ల మధ్య తాజాగా పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురిలో ఒకరిని ఎంపిక చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.



