సామాజిక న్యాయం అందించేలా ప్రజా పాలన
మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్ నగర్
Public governance to provide social justice
78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు తమ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నదని తెలిపారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద 83.33 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా ఆర్టీసీకి 40.32 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించనున్నామని, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు. ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో 10, గ్రామీణ ప్రాంతాలలో 44 ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కింద అర్హులైన ఒక లక్ష 9వేల 682 మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.గృహజ్యోతి పథకం కింద 1,19,834 మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగిందని, ఈ పథకం కింద వీరందరికీ లబ్ధి చేకూరిందని, తద్వారా ప్రభుత్వం 9.02 కోట్ల సబ్సిడీ ఇస్తున్నదని తెలిపారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పరిమితి పెంచడం జరిగిందని, ఈ పథకం కింద 89వేల 497 మంది శస్త్ర చికిత్సలు చేయించుకుని లబ్ధి పొందారని, ఇందుకుగాను ప్రభుత్వం 197.87 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 624 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో చదువుతున్న 71 వేల 689 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. రైతు పంట రుణమాఫీలో భాగంగా మొదటి విడత 42,291 మంది రైతులకు 232 కోట్ల రూపాయలు, రెండవ విడత 22 వేల 148 మంది రైతులకు 218 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినట్లు వెల్లడించారు.
దీంతోపాటు, వ్యవసాయ అనుబంధ రంగాలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ సంక్షేమం, క్రీడలు, ఎక్సైజ్, రహదారులు శాఖల ద్వారాపలు పథకాల కింద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవం, స్వచ్ఛదనం- పచ్చదనం కింద జిల్లాలోనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాను ప్రగతిలో మరింత ముందుకు నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. అంతేకాక ఆయా శాఖల అభివృద్ధిని తెలియజేసే విధంగా రూపొందించిన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సైతం మంత్రి సందర్శించారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, మహబూబ్ నగర్, దేవరకద్ర శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ,జిల్లాఎస్పీ జానకి,అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


