కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీలు రఘురాం రెడ్డి బృందం
Raghuram Reddy's team of MPs met Union Minister Gadkari
* రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని వినతి
ఖమ్మం జిల్లాలో హైవేల గురించి ప్రస్తావించిన లోక్ సభ సభ్యులు రామ సహాయం
ఖమ్మం:
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కలిశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ రఘురాం రెడ్డి.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ మిగతా ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ శెట్కర్ , గడ్డం వంశీకృష్ణ తదితరులతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో.. కొనసాగుతున్న నేషనల్ హైవేల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీలు కోరారు. జాప్యం లేకుండా వేగవంతం చేయాలని విన్నవించారు. రాష్ట్ర పర్యటనకు రావాలని.. ఇక్కడి హైవేల నిర్మాణ పురోగతిపై సమీక్షించాలని కోరారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రాజెక్టులపై ప్రస్తావించిన ఎంపీ రఘురాంరెడ్డి
ఉభయ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పలు హైవేల అంశాలను కేంద్ర మంత్రి గడ్కరీ కి ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి వివరించారు. ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో.. తల్లంపాడు, సోమవరం, చిట్ట గూడెం, రేచర్ల అలైన్మెంట్ గురించి, కోదాడ-ఖమ్మం హైవే పనులపై మాట్లాడారు. ఖమ్మం- విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి.. వీ.వెంకటాయపాలెం గ్రామం నుంచి బ్రాహ్మణపల్లి వరకు ప్యాకేజీ -1 పై చర్చించారు. ఇంకా.. కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పట్టి పినపాక వద్ద కిన్నెరసానిపై రెండవ వంతెన నిర్మాణ అవసరం, కోదాడ జంక్షన్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వరకు, భద్రాచలం పట్టణంలో సెంట్రల్ లైటింగ్ కావాలని కోరారు. ఎన్ హెచ్ 65 జగ్గయ్యపేట వయా వైరా నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా ప్రకటన, అప్ గ్రేడేషన్ ప్రతిపాదనలపై ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడారు. అనంతరం ఎంపీలంతా.. కేంద్ర మంత్రి గాడ్కరీని శాలువాతో సత్కరించి..రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా కోరారు.



